హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట, శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామాల్లో భూముల వేలాన్ని నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్లో 14.92 ఎకరాలను వేలం వేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఆ భూముల వేలాన్ని అడ్డుకోబోమని స్పష్టం చేసింది. జిల్లాల్లో వెయ్యి ఎకరాలకు తగ్గకుండా ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన కేసులను తర్వాత విచారిస్తామని ప్రకటించింది. భూముల వేలం ద్వారా రూ.50 వేల కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జూన్ 10న జీవో జారీచేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ బీజేపీకి చెందిన సినీనటి విజయశాంతి ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో వేర్వేరు చోట్ల చెల్లాచెదురుగా ఉన్న భూములను బహిరంగంగా వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, భూ ఆక్రమణలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నదని హెచ్ఎండీఏ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్రెడ్డి హైకోర్టుకు తెలిపారు. గతంలోని జీవో 571లో కొన్ని నిబంధనలను సవరించి ప్రభుత్వం కొత్త జీవోను జారీచేసిందని, భూములపై సర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. రాజ్యాంగంలోని 571వ అధికరణ కింద భూములను బహిరంగ వేలం వేసేందుకు లేదా బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కులు సంక్రమించాయని వివరించారు. ఆర్టికల్ 162 కింద ప్రభుత్వానికి విసృ్తతాధికారాలు ఉన్నాయని, తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్లోని 10వ రూల్ ప్రకారం ప్రజావసరాలకు భూములను బహిరంగ వేలం వేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని చెప్పారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రజావసరాల కోసమే భూముల వేలం వేయాలని ప్రభుత్వం నిశ్చయించిందని, ఇది మంత్రివర్గం తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ప్రభుత్వ భూములను వేలం వేయడం ఇదే కొత్తకాదని, ఈ తరహా వేలం గతంలోనూ జరిగిందని గుర్తుచేశారు. జిల్లాల్లో వెయ్యి ఎకరాల ల్యాండ్ బ్యాంక్లు ఎందుకో, భూముల రక్షణకు చేపట్టిన చర్యలేమిటో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కౌంటర్ దాఖలుచేయాలని ఆదేశించి, తదుపరి విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది.