హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేత హిద్మా కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో రాకపోకలను కొనసాగిస్తున్న వాహనాలను భద్రతా బలగాలు తనిఖీ చేస్తున్నాయి. ఆ ఏరియాల్లోని నివాసాలను కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు.
ములుగు జిల్లా వాజేడు మండలానికి 20 కిలోమీటర్ల దూరంలోని తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దులో పెనుగోలు, లంకపల్లి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. కూంబింగ్ నిర్వహిస్తున్న తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు వెంకటాపురం సీఐ కాగితోజు శివప్రసాద్ తెలిపారు.
వారి వద్ద ఏకే 47, ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ను పోలీసులు గుర్తించారు. మృతుల్లో నరోటి దామాల్ (పీపీసీఎం) మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా గట్ట ఏరియా వాసి, పునెం బద్రుది బీజాపూర్ జిల్లా పెద్దకోర్మ గ్రా మం, బీజాపూర్ జిల్లాకు చెందిన సోడి రామాల్ (సంతోష్ )గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం బీజాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్టు సీఐ తెలిపారు. దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఎలిగేడ్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. మరణించిన మావోయిస్టులకు జోహార్లు అర్పించినట్టు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.