హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి విరుగుడుకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చా యి. భారత్లో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ టీకాల కొరత కుంగుబాటుకు గురిచేస్తున్నది. ఇదే సమయంలో తమిళనాడుకు చెందిన ఎస్కేఎం సిద్ధ అండ్ ఆయుర్వేద కంపెనీ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ సంప్రదాయ ఔషధాన్ని ఆవిష్కరించింది. కబాసురా కుద్నీర్ పేరిట మార్కెట్లోకి విడుదలచేసింది. దీని ధర రూ.138 కాగా, ఈ మందు ఇమ్యూనోస్టిమ్యులేటర్గానే కాకుండా, ఇమ్యూనోమోడ్యులేటర్గానూ పనిచేస్తుండటం విశేషం. దీనిని ఆయూష్ డిపార్ట్మెంట్ సైతం ఆమోదించింది.
ప్రత్యేకత.. ప్రయోజనాలు
చెన్నైలోని లయోలా కళాశాల విస్తృత పరిశోధనలను సాగించి కుద్నీర్ కబాసురా మూలికా ఔషధాన్ని తయారుచేసింది. పుదినా, తులసి, పసుపు, లవంగం, కరివేపాకు, చుక్కు, తిప్పిలి తదితర 15 రకాల మూలికా రసాల మిశ్రమమే ఈ ఔషధం. దీనిని డికాషన్లా తాగడం, అవిరిపీల్చడం ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది 98 శాతం మేర కరోనా లక్షణాలకు కూడా నివారిస్తున్నదని కేంద్ర ఆయుష్ డిపార్ట్మెంట్ సైతం అధికారికంగా నిర్ధారించింది. ప్రస్తుతం ఈ ఔషధాన్ని తమిళనాడు ప్రజలు విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ ఔషధాన్ని రోజుకు రెండుసార్లు ఉదయం, సాయంత్రం భోజనం తరువాత తీసుకోవాల్సి ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంపొందించడమేకాకుండా వైరల్ వ్యాప్తిని నియంత్రించడంలో ఎంతో తోడ్పడుతుందని ఆయూష్ డిపార్ట్మెంట్ తెలిపింది.
ఇతర ఔషధాలు
కరోనా చికిత్సకు ఉపయోగకరమైన ఇతర ఔషధాలు కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి. నీలవేంబు కషాయం ఇందులో ఒకటి. రోజుకు రెండుసార్లు భోజనం తరువాత తీసుకోవాలి. ఇది అన్నిరకాల వైరల్ ఇన్ఫెక్షన్లను దూరంచేస్తుంది. డెంగ్యూ, చికున్గున్యా వ్యాధుల నివారణకు ఈ కషాయం పేరుపొందింది. నెల్లికా లేహ్యాన్ని రోజూ ఒక టీస్పూన్ భోజనం తరువాత తీసుకోవాలి. ఇవిగాక ఆయుష్ 64 గుళికలను రోజుకు రెండు చొప్పున వాడాలి. ఆగస్త్య హరీటాకై చుర్ణాన్ని వేడినీటితో కలిపి రోజుకు ఒకసారి తీసుకొచ్చు.