ఇల్లెందు, జూన్ 10: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్ సూచన మేరకు అక్కున చేర్చుకున్నారు ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన బట్టు గణేశ్ (32), స్రవంతి(30) దంపతులు. వీరికి ఏడేండ్ల కుమారుడు కృశన్, ఐదేళ్ల కూతురు హేమతేజ ఉన్నారు. గణేశ్ క్యాన్సర్తో గతేడాది మరణించాడు. భార్య స్రవంతికి ఇటీవల కరోనా రావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ ఈ నెల 8న మరణించింది. దీంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషయాన్ని గణేశ్ స్నేహితుడు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే మంత్రి కేటీఆర్ స్పందించి పిల్లలను ఆదుకోవాలని ట్విట్టర్ వేదికగా ఇల్లెందు ఎమ్మెల్యేను కోరారు. వెంటనే స్పందించిన హరిప్రియానాయక్.. వారికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని, కలెక్టర్తో మాట్లాడి పిల్లలకు అందాల్సిన సాయంపై చర్చిస్తామన్నారు. ఇద్దరు పిల్లలను విద్యాపరంగా దత్తత తీసుకుని చదివిస్తామని ఎమ్మెల్యే దంపతులు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్కు హామీ ఇచ్చారు.