హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతిని నిలువునా దట్టించుకున్న గేయ రచయిత కందికొండ యాదగిరి అనారోగ్యం పాలయ్యారు. కొంతకాలంగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తమను ఆదుకోవాలని కందికొండ కుటుంబసభ్యులు, మిత్రులు వేడుకొంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలోని పేద కుటుంబంలో పుట్టిన యాదగిరి.. కందికొండ పేరుతో తెలుగు చిత్రసీమకు పరిచయమై గేయరచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఓవైపు సినిమా పాటలు.. మరోవైపు బతుకమ్మ, బోనాలు వంటి పండుగతోపాటు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఆయన రాసిన పాటలు విశేష ప్రజాదరణ పొందాయి. 15 ఏండ్ల క్రితమే క్యాన్సర్ బారినపడిన కందికొండ.. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆర్థిక వెనుకబాటుతనం వల్ల ఆయన కుటుంబం చేయూత కోసం ఎదురుచూస్తున్నది. సహాయం చేయాలని అర్థిస్తున్నది. ప్రత్యక్షంగా కానీ, గూగుల్పే ద్వారా (నంబర్ 81793 10687) లేదా Andhra Bank Account Details: Kandikonda Rama Devi Account No: 135510100174728, IFSC Code: ANDB0001355 సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కందికొండకు కేటీఆర్ చేయూత
ప్రముఖ గేయ రచయిత కందికొండ కుటుంబానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు భరోసా ఇచ్చారు. కందికొండ అనారోగ్యంతో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న కేటీఆర్ వైద్యానికయ్యే ఖర్చులు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2.5 లక్షల సహాయం అందేలా చేశారు.