న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్ యశ్పాల్ శర్మ ఇవాళ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. యశ్పాల్ వయసు 66 ఏళ్లు. కపిల్దేవ్ సారథ్యంలో 1983లో క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన జట్టులో యశ్పాల్ సభ్యుడిగా ఉన్నాడు. 83 వరల్డ్కప్ ఆడిన సభ్యుల్లో.. మరణించిన తొలి క్రికెటర్ యశ్పాల్ శర్మ కావడం విషాదకరం. ఇండియా తరపున 37 వన్డేలు, 42 టెస్టులు ఆడాడు. 1979 నుంచి 83 మధ్య కాలంలో.. మిడిల్ ఆర్డర్లో ఇండియా టీమ్కు కీలక ప్లేయర్గా యశ్పాల్ బాధ్యతలు నిర్వర్తించాడు. మంచి ఫీల్డర్ కూడా. కొన్నేళ్ల పాటు ఆయన జాతీయ సెలెక్టర్గా ఉన్నారు.
1983లో ఇంగ్లండ్లో జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో.. సెమీఫైనల్ మ్యాచ్లో యశ్పాల్ అత్యధిక పరుగులు చేశారు. ఆ వరల్డ్ కప్లో ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాట్స్మెన్గా యశ్పాల్ నిలిచారు. 83 వరల్డ్కప్ లీగ్ స్టేజ్లో వెస్టిండీస్తో జరిగిన తొలి మ్యాచ్లో యశ్పాల్ 89 రన్స్ చేశాడు. ఇక ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లోనూ అతను 61 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యశ్పాల్ శర్మ 79 అంతర్జాతీయ మ్యాచుల్లో 2489 రన్స్ చేశారు.