నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 23: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతున్నది. దీంతో గురువారం 32 వరద గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి మిగులు జలాలను వదులుతున్నారు. ఎగువ నుంచి 1,68,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 1,67,956 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా సాయంత్రానికి 1,090.90 అడుగుల (89.763 టీఎంసీలు) నీటినిల్వ ఉన్నది. ప్రాజెక్ట్లోకి ఈ సీజన్లో ఇప్పటివరకు 318.503 టీఎంసీల వరద వచ్చినట్టు ఈఈ తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి 24,114 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి 34,673 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాలకు వరద వచ్చి చేరుతున్నది. జూరాలకు 44 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 40,388 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. 37,100 క్యూసెక్కులు విద్యుదుత్పత్తికి వినియోగిస్తుండగా.. ఎగువ, దిగువ విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా 8.969 టీఎంసీలు నిల్వ ఉన్నది.
నాగార్జునసాగర్కు ఇన్ఫ్లో పెరగడంతో అధికారులు ప్రాజెక్టు 4క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యం 590 అడుగుల (312.045 టీఎంసీలు) మేరకు నిల్వ ఉంచి అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్కు 79,796 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు.