Telangana | హైదరాబాద్ : బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరంపై అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పరిసరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలకూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొన్ని చోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాజధాని హైదరాబాద్లో మరో గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు గంటలు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు రెడ్ అలర్ట్ జారీచేసింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించింది.
కాగా, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించింది. డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించింది.