గతేడాది లాక్డౌన్ కారణంగా ఎన్నో పేద, మధ్యతరగతి జీవితాలు రోడ్డున పడ్డాయి. కంపెనీలు మూతపడటంతో ఎందరో ఉపాధి కోల్పోయారు. చేసేందుకు పనిలేక విధిని నిందించారు. ఉన్నపళంగా ఉద్యోగాలు ఊడిపోయినా ఈ హైదరాబాదీ మహిళలు బెంబేలెత్తలేదు. ఆరవై ఏండ్లు దాటాక కూడా ఆంత్రప్రెన్యూర్లుగా అవతారం ఎత్తారు. స్వయం ఉపాధి పొందడంతోపాటు ఉద్యోగాలు కోల్పోయిన వారికి పని కల్పిస్తున్నారు.
లాక్డౌన్ మొదలైన కొత్తల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసింది ఓయో హోటల్స్ క్వాలిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే 64 ఏండ్ల నాగ్పాల్. లాక్డౌన్ కొనసాగే కొద్దీ వర్క్ ఫ్రమ్ హోమ్ పెరుగుతూ పోయింది. కొన్నాళ్లకు ఆమె ఉద్యోగమే పోయింది. అయినా భయపడలేదు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో 40 ఏండ్ల అనుభవం ఆమెది. తానే ఓ సంస్థను ప్రారంభించాలనుకుంది. ఈ క్రమంలో రిటైర్మెంట్కు దగ్గరున్న మహిళలతో జట్టుకట్టాలనుకుంది. 60 ఏండ్లు నిండిన నలుగురు మహిళలు.. మీనాక్షి అగర్వాల్, మధు దూబే, స్వర్ణలత మన్కికార్, సుచిత్ర నాయుడు చేతులు కలిపి ‘సోహో’ పేరుతో హౌజ్కీపర్స్ సిండికేట్ను మొదలుపెట్టారు.
చేతినిండా పని
మార్కెట్లో కొత్త అవకాశాలు దొరకడం గగనంగా మారిన సమయంలో వీళ్ల స్టార్టప్ ఉద్యోగాలు కోల్పోయిన మహిళలకు మంచి ప్లాట్ ఫామ్గా మారింది. 2020 సెప్టెంబర్లో ప్రారంభమైన ఈ సోహోలో మొత్తం 13 మంది హౌజ్కీపర్స్ ఉన్నారు. కొత్త వ్యాపారాలకు కావాల్సిన ప్రీ-ఓపెనింగ్ సపోర్ట్.. అంటే మ్యానువల్స్, పాలసీలు, ప్రొసీజర్లను ఈ కంపెనీ సమకూరుస్తుంది. అలాగే కార్పొరేట్ హౌజ్ కీపింగ్ కన్సల్టెన్సీ, హౌజ్కీపింగ్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ రివ్యూ వంటి విషయాలపై సేవలు అందిస్తున్నారు. అంతేకాదు, క్వాలిటీ చెక్, ఆడిట్స్ నిర్వహిస్తుంది సోహో. ‘2021 జనవరిలో మేము అఫీషియల్గా పనులు ప్రారంభించాం. అప్పటికే మాకు కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి. 60 రెస్టారెంట్లు ఫ్రాంచైజీగా ఉన్న కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్ పూర్తి చేశాం. దాంతోపాటు మరో నాలుగు ప్రాజెక్టులు నడుస్తున్నాయి. మహిళలకు మెరుగైన అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం’ అంటున్నది నాగ్పాల్.