హైదరాబాద్: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో కుండపోతగా వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఏకధాటిగా వాన పడింది. దీంతో హైదరాబాద్లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా నాగోల్ పరిధిలోని బండ్లగూడలో అత్యధికంగా 21.2 సెంటీమీటర్లు, వనస్థలిపురంలో 19.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది.
ఇక జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో బస్వాపూర్ వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. బస్వాపూర్ సమీపంలో మోయతుమ్మెద వాగుకు వరద పోటెత్తింది.
సిద్దిపేట-హన్మకొండ రోడ్డులో బ్రిడ్జిపై నుంచి వాగు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నంగునూరు, ధూళిమిట్ట మండలంలో చెక్డ్యామ్లు పొంగిపొర్లుతున్నాయి.
నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలం దాచారం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలంలో కురిసిన వానలకు ఏట్ల ఎర్రవల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో దేవరపల్లి గ్రామ ప్రజలు నాగరగూడ వైపు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు కురిసాయి. కరీంనగర్, మానకొండూరు, శంకరపట్నం, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్, గంగాధర, ఎల్లారెడ్డిపేట, రుద్రంగి, చందుర్తి, మెట్పల్లిలో వర్షం కూరిసింది.
కథలాపూర్ మండలంలో కురిన వానలకు వరదకాలువ బ్రిడ్జిపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో కథలాపూర్-భూషణరావు పేట గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండలంలోని చింతకుంట గ్రామం వరద నీటిలో మునిగిపోయింది.
వేములవాడలో బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. దీంతో రాజన్న ఆలయ ప్రాంగణం జలమయమయింది. దేవాలయం ముందు, పాత ఆంధ్రబ్యాంక్ వద్ద డ్రైనేజ్ సరిగా లేకపోవడంతో మురికి నీరు పరిసర ప్రాంతాల్లోని దుకాణంలోకి చేరాయి. దీంతో షాప్లో ఉన్న సామాన్లు అన్నీ తడిసి ముద్దయ్యాయి.
ఛత్తీస్గఢ్పై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి ఏర్పడింది. దీనిప్రభావంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గురువారం కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.