హైదరాబాద్ : గులాబ్ తుఫాను ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో తీవ్ర ఐఎండీ పేర్కొంది. మరో ఆరు గంటల్లో వాయుగుండంగా మారుతుందని, తదుపరి 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే తూర్పు, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉన్నట్లు తెలిపింది.
వీటి ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు, ఎల్లుండి పలు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇవాళ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని, రేపు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. రేపు ఉదయం 8.30గంటల వరకు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కొత్తగూడెం, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మల్కాజ్గిరి పరిధిలో మోస్తరు వర్షాపాతం నమోదైంది.