హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు రాష్ర్టంలోని జలాశయాలు నిండు కుండలా తొణికిసలాడుతున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. విరామం లేని వర్షాలతో పట్టణాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించుకుంటూ, చర్యలు తీసుకుంటున్నారు.
కాళేశ్వరం జలాశయానికి వరద పోటెత్తింది. వర్షాలు, ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలతో భారీగా వరద పోటెత్తింది. మేడిగడ్డ బ్యారేజీ ఇన్ఫ్లో 1,05,230 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,03,990 క్యూసెక్కులుగా ఉంది. మేడిగడ్డ బ్యారేజీ 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ గరిష్ఠ నీటి నిల్వ 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 11.1 టీఎంసీలు.
అన్నారం(సరస్వతీ) బ్యారేజీ ఇన్ఫ్లో 57 వేల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 13,500 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ 15 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ గరిష్ఠ నీటి నిల్వ 10.87 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 7.29 టీఎంసీలు.
పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు ఇన్ప్లో 62 వేల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 54 వేల క్యూసెక్కులుగా ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి 10 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 20.74 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 19.64 టీఎంసీలు.
నిర్మల్ జిల్లాలోని భైంసా గడ్డెన్న జలాశయానికి కూడా వరద కొనసాగుతోంది. ఈ జలాశయం ఇన్ఫ్లో 38,500 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 45,500 క్యూసెక్కులుగా ఉంది. ఈ జలాశయం 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గరిష్ఠ నీటిమట్టం 358.7 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 358.4 అడుగులు.
కడెం జలాశయం ఇన్ఫ్లో లక్షా 34 వేల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,00,506 క్యూసెక్కులుగా ఉంది. గరిష్ఠ నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 696.100 అడుగులు. గరిష్ఠ నీటి నిల్వ 7.603 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 6.623 టీఎంసీలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో వరద పరవళ్లు తొక్కుతోంది. పర్ణశాలలో సీతమ్మ విగ్రహం వద్దకు వరద నీరు చేరింది. నారచీరల ప్రాంతం, ఇనుప వంతెన, స్వామి సింహాసనం కూడా నీట మునిగిపోయింది. సున్నంబట్టి – బైరాగులపాడు మధ్య రోడ్డుపైకి వరద నీరు చేరింది. తాటివారి గూడెం వద్ద వాగు పొంగి పొర్లుతోంది.