సిమెంట్ కల్లాలతో అనేక ప్రయోజనాలు
నిర్మాణానికి ఆసక్తి చూపుతున్న రైతులు
మండలంలో 455 మంజూరు
ఇప్పుటికే 191 పూర్తి
ఒకప్పుడు ధాన్యం ఆరబోతకు రైతన్న అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ప్రక్రియ ఎంతో సులభతరమైంది. తెలంగాణ ప్రభుత్వం కల్లాల నిర్మాణానికి చేయూతనందిస్తుండగా, అన్నదాతలు సద్వినియోగం చేసుకుంటున్నారు. పండించిన చోటే సరైన తేమ శాతం వచ్చేలా ధాన్యాన్ని ఆరబెట్టి ఆ తరువాత కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు.
-గన్నేరువరం, ఏప్రిల్ 25
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలో 455 సిమెంట్ కల్లాలు మంజూరు కాగా, అధికారుల ప్రోత్సాహంతో అత్యధికంగా 191 పూర్తయ్యాయి. మాదాపూర్లో 68, ఖాసీంపేటలో 74 కల్లాలు మంజూరు కాగా, 100 శాతం నిర్మాణాలు పూర్తయి రైతులకు అందుబాటులోకి సైతం వచ్చాయి. మిగతా గ్రామాల్లో పనులు వివిధ దశాల్లో ఉన్నాయి. కల్లాలు నిర్మించుకున్న రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికే ప్రభుత్వం సొమ్ము జమ చేసింది.
కల్లాలు.. మూడు రకాలు
ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులకు ఇదివరకు సరైన సౌకర్యాలు ఉండకపోయేవి. విధిలేక రోడ్లపై పోసి, పరదాలు కప్పుతూ పడిగాపులు కాయాల్సి వచ్చేది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల ఇబ్బందులను తొలగించేందుకు పూనుకున్నది. తమ సొంత భూముల్లోనే కల్లాలను నిర్మించుకునే అవకాశం కల్పించగా, మండలంలో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం విస్తీర్ణాన్ని బట్టి మూడు రకాల కల్లాలు నిర్మించుకునే అవకాశం కల్పించింది. 50 చదరపు మీటర్లకు రూ. 56వేలు, 60 చ.మీలకు రూ. 68వేలు, 75చ.మీలకు రూ. 85 వేలు ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు చెల్లించనున్నది. కాగా, ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం రాయితీ కల్పిస్తున్నది. మిగతా సామాజిక వర్గాలకు చెందిన రైతులు పది శాతం వాటా చెల్లించాలి. నిర్మాణం జరుగుతున్న సమయంలోనే రెండు విడుతల్లో లబ్ధిదారులకు డబ్బులను అందజేయనున్నారు.