హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ వానలు కురుస్తున్నాయి. రాజధాని హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. సోమవారం రాత్రి తొమ్మిదింటి వరకు మెదక్ జిల్లా చిల్పిచేడు మండలం చిట్కుల్ అత్యధికంగా 14.08 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు ఉన్న ఉపరితల ద్రోణి సోమవారం దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా కోమరిన్ తీరం వరకు సముద్రమట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తువరకు కొనసాగుతున్నదని పేర్కొన్నది.
వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సోమవారం గాంగెటిక్ పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఉండి, సముద్ర మట్టం నుంచి 5.8 కిలో మీటర్ల వరకు కొనసాగుతున్నదని తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం రాత్రి, మంగళవారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలం అలియాబాద్లో 12.10 సెం.మీ., యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో 10.03 సెం.మీ., పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాలపల్లిలో 9.08 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది.