హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లో కుండపోతగా వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా ఏకధాటిగా వాన పడింది. బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన వాన అర్థరాత్రి దాటేవరకు కురుస్తూనే ఉన్నది. దీంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు ప్రవహించింది. నాగోల్ పరిధిలోని బండ్లగూడలో అత్యధికంగా 21.2 సెంటీమీటర్లు, వనస్థలిపురంలో 19.2 సెంటీమీటర్లు, హస్తినాపురంలో 19, భవానీనగర్లో 17.9, హయత్నగర్లో 17.1 సెంటీమీటర్లు, రామంతాపూర్లో 17.1 సెంటీమీటర్లు, హబ్సిగూడలో 16.5, నాగోల్లో 15.6, ఎల్బీనగర్లో 14.9, లింగోజిగూడలో 14.6, ఉప్పల్ మారుతినగర్లో 13.4 సెంటీమీటర్ల చొప్పున వాన నమోదయ్యింది. అదేవిధంగా దిల్సుఖ్నగర్, మలక్పేట, నాంపల్లి, బంజారాహిల్స్, అమీర్పేట, కూకట్పల్లిలో వర్షం కురిసింది.
బుధవారం సాయంత్రం నుంచి కురిసిన ఎడతెరపిలేని వానలతో పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. అంబర్పేట మూసీ పరివాహ ప్రాంతాల్లో డ్రైనేజీలు ఉప్పొంగాయి. పటేల్నగర్, ప్రేమ్నగర్లోని ఇళ్లలోకి మురుగునీరు చేరింది. ముసారాంబాగ్ బ్రిడ్జిపైనుంచి మూసీనది ప్రవహిస్తున్నది. దీంతో వంతెనపై పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. నాగోల్ పరిధిలోని అయ్యప్ప నగర్ కాలనీ నీట మునిగింది. మల్లికార్జున నగర్, త్యాగరాజనగర్ కాలనీల్లోకి, సరూర్నగర్ చెరువుకట్ట లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. కోదండరాంనగర్, సీపల బస్తీ, వీవీనగర్, కమలానగర్లో వరద నీరు ప్రవహిస్తున్నది.
ఛత్తీస్గఢ్పై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి ఏర్పడింది. దీనిప్రభావంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గురువారం కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.