హైదరాబాద్ : మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో ఉపరితల గనుల్లోకి వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. మంచిర్యాల పరిధిలో కేకే, ఆర్కేపీ, ఎస్ఆర్పీ, ఇందారం ఉపరితల గనుల్లో ఉత్పత్తికి ఆటంకం కలిగింది. వర్షం నీరు చేరడంతో 32 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, పినపాకలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షంతో ఇల్లందు, కోయగూడెం ఉపరితల గనుల్లో పనులకు ఆటంకం ఏర్పడింది. 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 28 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీతకు అంతరాయం కలిగింది. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, కరకగూడెం, గుండాల, ఆలపెల్లిలో భారీ వర్షం కురిసింది. మణుగూరు ఉపరితల గనుల్లో ఓవర్ బర్డెన్ పనులకు అంతరాయం ఏర్పడింది. భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ 4వ యూనిట్ సివిల్ వెల్డింగ్ పనులకు ఆటంకం కలిగింది.