హైదరాబాద్ : ఆదివారం కురిసిన తేలికపాటి నుంచి భారీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాల్లో పంటలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం దెబ్బతింది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి పొలాల్లోని పంటలు దెబ్బతినగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. రైతులు నిస్సాయంగా చూస్తుండిపోవాల్సి వచ్చింది. రానున్న రెండు, మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ధాన్యాన్ని రక్షించుకునేందుకు అధికారులు చర్యలను వేగవంతం చేశారు.
రైతులకు సరిపడా టార్పాలిన్స్ అందజేయాల్సిందిగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి. వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాలు తగ్గేంతవరకు ధాన్యాన్ని రైతు వేదిక కేంద్రాల్లో నిల్వ చేయాల్సిందిగా సూచించారు. రానున్న మూడు రోజులు రైతులు జాగ్రత్తగా ఉంటూ ధాన్యాన్ని సంరక్షించుకోవాల్సిందిగా కోరారు. అకాల వర్షంతో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం వర్షం కురిసింది. మధ్యాహ్నం మొత్తం మేఘావృతమై సాయంత్రానికి వర్షం కురిసింది. మొత్తం 11 మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 8 మండలాల్లో వాన పడింది. అశ్వరావుపేటలో రికార్డుస్థాయిలో 14.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు.