హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ర్టంలోని జలాశయాలు నిండుకుండలా తొణికిసలాడుతున్నాయి. రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఉపరితల ద్రోణి బలహీనపడింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య 5.8 కి.మీ. ఎత్తున ద్రోణి ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 23న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
తెలంగాణ స్టేట్ ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ర్టంలో 10.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లాలోని మరికల్లో అత్యధికంగా 70.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇక జులై 1 నుంచి 19వ తేదీ వరకు రాష్ర్ట వ్యాప్తంగా 402 మి.మీ. వర్షపాతం నమోదైంది.