ఆకాశం అందాలను పులుముకొన్నది. మొగులు కొండలు మోసుకొచ్చిన జలధారలతో పుడమితల్లి పులకిస్తున్నది. చినుకు చినుకు కలిసి మడిని చిత్తడి చేసి అన్నదాతను మురిపిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా దట్టమైన మబ్బులు కమ్ముకొని వాన ముంచెత్తింది.
ఆదివారం పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వానలు పడ్డాయి. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలో 14.95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు వరద రాక కొనసాగుతున్నది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. మరోవైపు, సోమ, మంగళవారాల్లోనూ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండు జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
ఆదివారం నుంచి సోమవారం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, హైదరాబాద్, మెదక్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురువొచ్చని పేర్కొన్నది. నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో
ప్రమాదకరస్థాయిలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వాన్ని వాతావరణ కేంద్రం అలర్ట్ చేసింది.
నమస్తే తెలంగాణ నెట్వర్క్: రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడ్డాయి. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండ లం పాలెంలో 14.95 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం దగ్గర ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా మధ్య ట్రోపోస్పియర్ వరకు ద్రోణి వ్యాపించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండు జిల్లాల్లో కుంభవృష్టి వానలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని తెలిపింది.
నాగర్కర్నూల్, వరంగల్ రూరల్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, జనగామ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెరలో 14.65 సెంటీమీటర్ల వర్షం పడ గా.. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటలో 14, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో 11.83, నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 11.45, వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో 11.33 సెంటీమీటర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో 11.13, వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 10.55, వరంగల్ అర్బన్ జిల్లా పైడిపల్లిలో 10.10, ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో 10.03 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ జలపాతం జెండాగుట్ట పైనుంచి 100 మీటర్ల ఎత్తులో పొంగి పొర్లుతున్నది. తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్కు వెళ్లే రహదారిలో సండ్రవాగు ఉరకలు పెడుతున్నది. రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లో ఉన్న సింగరేణి ఓపెన్కాస్ట్ బొగ్గు గనుల్లో భారీగా నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నాగారం మండలం ఫణిగిరి గుట్ట జలపాతాన్ని మరిపించింది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల పరిధిలోని శ్రీభీమేశ్వరవాగు పొంగిపొర్లింది. వాగు అవతల చిక్కుకున్న రైతులు, కూలీలు, పశువులను జేసీబీ సాయంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా తీసుకొచ్చారు. మంజీరలో వరద ప్రవాహంతో నాగమడుగు వద్ద అచ్చంపేట-నిజాంసాగర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి. మరోవైపు, అల్పపీడన ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్, జూలై 11(నమస్తే తెలంగాణ)/ధరూరు/అయిజ: ఎగువన కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు స్వల్పంగా వరద ప్రవాహం పెరిగింది. జూరాల ప్రాజెక్ట్కు ఆదివారం సాయంత్రానికి ఇన్ఫ్లో 1,100 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2,377 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు రెండు వేలకుపైగా క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. సింగూరు, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు సైతం వరద రావడం మొదలైంది. మరోవైపు, నిర్మల్ జిల్లాలో వర్షాలకుతోడు ఎగువనుంచి వరద వచ్చి చేరడంతో కడెం ప్రాజెక్టు పూర్తిగా నిండింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 695.350 అడుగులు (6.444 టీఎంసీల) వద్ద ఉన్నది. ఆదివారం జలాశయంలోకి 34,254 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో అధికారులు డ్యాం సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని 699 అడుగుల వద్దకు నీరు చేరగానే ఐదు వరద గేట్లు ఎత్తారు. 29,756 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు.
బైక్ కొట్టుకుపోయి ఒకరు మృతి
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండ లం కుప్టి గ్రామ సమీపంలోని ఒర్రెలో వరద ప్రవాహానికి బైక్ కొట్టుకుపోయి గుండెం స్వామి (30) మృతి చెందాడు. బోథ్ మండలం కుచులాపూర్కు చెందిన స్వామి.. బంధువుల ఇంటికి వెళ్లి శనివారం రాత్రి బైక్పై తిరిగి వస్తున్నాడు. కుప్టి సమీపంలోని ఒర్రెకు భారీగా వరద రావడంతో బైక్ అందులో కొట్టుకుపోయింది. స్వామి గల్లంతయ్యాడు. అతని మృతదేహం ఆదివారం లభ్యమైంది. మరోవైపు, మండలంలోని కొర్టికల్ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట-గురిజాల రహదారిపై ఉన్న లోలెవల్ వంతెన దాటుతూ ఒకరు గల్లంతయ్యారు.