అప్పుడే ఎండ.. మండిపోతున్నది అనుకోగానే కమ్ముకొచ్చిన కారుమబ్బులు.. ఆకాశంవైపు కన్నెత్తి చూడటమే ఆలస్యం.. సముద్రంలోనుంచి నీళ్లను ఎత్తి భూమిపై పోస్తున్నట్టు వాన ఉగ్రరూపం ఎత్తింది. హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. గంటపాటే అయినా నగర రోడ్లన్నింటినీ ముంచేసింది. లోతట్టు ప్రాంతాలను జలమయం చేసేసింది. నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 18: ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఆదివారం మధ్యాహ్నం 3:50 గంటలకు మొదలైన వాన దాదాపు గంటపాటు దంచికొట్టింది. వాన ధాటికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల రోడ్లు నీట మునిగాయి. రోడ్లపై వరదనీరు మోకాళ్లలోతుకు చేరి ట్రాఫిక్ స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగానూ భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం ఘన్పూర్లో 9.05 సెంటీమీటర్ల వాన పడిం ది. వనపర్తి జిల్లా పెద్దమందడి లో 8.30 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో 7.55 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లా యాలాల్లో 7.45 సెంటీమీటర్లు, వననర్తి జిల్లా కొత్తకోట మండలం కన్నాయిపల్లిలో 7.20 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో 6.75 సెంటీమీటర్లు, పెద్దఅంబర్పేటలో 6.55 సెంటీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో 6.53సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాతబస్తీలోని బహుదూర్పురలో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాగా, వారం నుంచి కురుస్తున్న వర్షాలతో శ్రీశైలానికి ఉత్తరద్వారం.. నల్లమల కొండల్లోని ఉమామహేశ్వర క్షేత్రం వద్ద ఆదివారం జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. గతేడాది దేవాలయానికి సమీపంలో జలధారలు పడగా, ఈసారి పాపనాశనం వద్ద జలధారలు ఆకట్టుకున్నాయి. ఇదిలాఉండగా, వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల ఈనెల 23 వరకు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ నెల 21న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వెల్లడించింది. మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర దక్షిణద్రోణి ఏర్పడింది. ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వద్ద శనివారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నిలకడగా ఉన్నది. 17 డిగ్రీల ఉత్తర ఆక్షాంశం వెంబడి సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల వద్ద తూర్పు-పశ్చిమద్రోణి కొనసాగుతూ ఎత్తుకువెళ్లే కొద్ది దక్షిణ వైపునకు వంపు తిరిగి ఉన్నది. దీని ప్రభావంతో ఈ నెల 23 వరకు పలుచోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ భారీ వానలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం తెలిపింది.
పిడుగుపడి ఇద్దరు, మిద్దె కూలి ఒకరు మృతి
పిడుగుపాటుకు గురై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం జేత్యతండాకు చెందిన రైతు హాలవత్ సర్వన్(40), ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మద్దులపల్లికి చెందిన ముదిరెడ్డి నారాయణరెడ్డి (62) మృతి చెందారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం చిన్నధన్వాడలో మట్టిమిద్దె కూలి సరస్వతి(48) అనే మహిళ దుర్మరణం చెందింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చెర జలపాతంలో పడి యువకుడు గల్లంతయ్యాడు.