న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ఢిల్లీలో మరో ఘోర విషాదం. గంగారాం దవాఖానలో ఆక్సిజన్ అందక 25 మంది రోగులు చనిపోయి 24 గంటలు కూడా కాకముందే ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ దవాఖానలో 20 మంది ప్రాణవాయువు లేక ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యం వల్లే ఈ ఘోరం జరిగింది. ఆక్సిజన్ లేక రెండు రోజుల్లోనే 45 మంది ప్రాణాలు కోల్పోవడం, దాదాపు అన్ని దవాఖానల్లో ఆక్సిజన్కు కొరత ఉండటంతో ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో అని భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం సాయంత్రానికి రావాల్సిన ఆక్సిజన్ దవాఖానకు చేరకపోవడంతో రోగులకు ఆక్సిజన్ సరిపోలేదని, అందువల్ల రోగులు చనిపోయారని జైపూర్ గోల్డెన్ దవాఖాన మెడికల్ డైరెక్టర్ డీకే బలూజా తెలిపారు. ‘శుక్రవారం రాత్రి ఆక్సిజన్ అందక హాస్పిటల్లో 20 మంది కరోనా రోగులు చనిపోయారు. మా దవాఖానలో ప్రస్తుతం 200 మందికి పైగా కొవిడ్ చికిత్స పొందుతున్నారు. వీరిలో 80 శాతం మందికి ఆక్సిజన్ కావాలి. మా దగ్గర అరగంటకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉంది’ అని ఆయన శనివారం ఉదయం 10.45 గంటలకు చెప్పారు. శుక్రవారం సాయంత్రానికి 3,600 లీటర్ల ఆక్సిజన్ అందాల్సి ఉండగా, అర్ధరాత్రి వరకు కేవలం 1500 లీటర్లు మాత్రమే అందిందని తెలిపారు. సరఫరా ఆలస్యం కావడంతో రోగులు ప్రాణాలు కోల్పోయారన్నారు. మరోవైపు, సరోజ్ దవాఖానకు 44 గంటలుగా ఆక్సిజన్ సరఫరా కాలేదు.
ఏదైనా రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు ఉంటే ఢిల్లీకి వెంటనే పంపించాలని రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. కేంద్రం సహాయం చేస్తున్నా కూడా ఢిల్లీలో కొవిడ్ తీవ్రత వల్ల అది సరిపోవడం లేదన్నారు.
ఢిల్లీలో ఎయిమ్స్కు కరోనా రోగుల తాకిడి పెరుగుతున్నది. దీంతో తగినంత ఆక్సిజన్ను సరఫరా చేయడానికి పైప్లైన్లో శనివారం మార్పులు చేశారు. దీంతో గంటపాటు ఎమర్జెన్సీ విభాగంలో అడ్మిషన్లను నిలిపివేశారు. ఆ విభాగంలో ఇప్పటికే 100 మంది చికిత్స పొందుతున్నారు.
ఆక్సిజన్ లేక అమృత్సర్లో ఆరుగురు మృతి
వీరిలో ఐదుగురు కరోనా రోగులు
అమృత్సర్, ఏప్రిల్ 24: పంజాబ్లోని అమృత్సర్లో నీలకంఠ అనే ప్రైవేట్ దవాఖానలో ఆక్సిజన్ కొరతతో ఆరుగురు చనిపోయారు. అందులో ఐదుగురు కరోనా రోగులున్నారు. ఆక్సిజన్ అయిపోతున్నదని జిల్లా అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా సాయం చేయలేదని దవాఖాన ఎండీ సునీల్ దేవగణ్ చెప్పారు. దీనిని రాష్ట్ర వైద్య విద్య మంత్రి ఓపీ సోని ఖండించారు. అధికారులకు సరైన సమాచారం అందలేదన్నారు. కేవలం ఒక్కసారి వాట్సాప్లో చిన్న సందేశం పంపి ఊరుకొన్నారని పేర్కొన్నారు. ఘటనపై పంజాబ్ సీఎం అమరీందర్సింగ్ దర్యాప్తునకు ఆదేశించారు.
‘మా దవాఖానలో 150 మంది కొవిడ్ రోగులు ఉన్నారు. 120 మందికి ఆక్సిజన్ కావాలి. రెండు గంటలకు మించి ఆక్సిజన్ లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. తెలిసిన ప్రతీ ఒక్కరినీ సాయం అడిగాను. కానీ ఎవరూ సాయం చేయలేదు.’
-ఢిల్లీలోని నియో దవాఖాన డైరెక్టర్ నరీన్ సెహగల్
వీడియో మెసేజ్లో అభ్యర్థన ఇది.
‘మాకు రోజుకు 8 వేల లీటర్ల ఆక్సిజన్ కావాలి. ప్రభుత్వాన్ని అభ్యర్థించిన 12 గంటల తర్వాత కూడా కేవలం 500 లీటర్ల ఆక్సిజన్ పంపించారు. దవాఖానలో 350 మంది చికిత్స పొందుతున్నారు. వారిని బతికించాలంటే ఆక్సిజన్ ఒక్కటే ఔషధం. అది అందజేయకపోతే మేం ఏం చేయలేం’
-ఢిల్లీలోని బాత్రా దవాఖాన ఎండీ ఎస్సీఎల్ గుప్తా ఆవేదన ఇది.
శుక్రవారం ఆక్సిజన్ లేక 25 మంది కరోనా రోగులు చనిపోయిన గంగారాం దవాఖానలో రోజూ 11వేల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ కావాలి. శనివారం ఉదయం 11.35 గంటలకు 1.5 టన్నుల ఆక్సిజన్ చేరుకొనే సరికి అక్కడ కేవలం 200 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ ఉంది. ట్యాంకర్ ఓ గంట ఆలస్యం అయితే… ఊహించుకోవడం కూడా కష్టమే..