న్యూఢిల్లీ, మే 6: త్వరలో అందుబాటులోకి రానున్న ప్రామాణిక దేశీయ ప్రయాణ బీమా పాలసీకి సంబంధించి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) మార్గదర్శకాలను జారీ చేసింది. ‘భారత్ యాత్రా సురక్షా’ అనే ఈ పాలసీని జులై 1 నుంచి ఆఫర్ చేయాలని సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. దేశీయంగా ట్యాక్సీలు, బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాల బారినపడినవారికి అండగా నిలిచే ఈ పాలసీలో ఐదు రకాల ప్లాన్లు (ప్లాన్-ఏ, ప్లాన్-బీ, ప్లాన్-సీ, ప్లాన్-డీ, ప్లాన్-ఈ) ఉంటాయి. ప్రయాణానికి ఎంచుకున్న వాహనం, ప్రయాణ దూరంపై ఈ ప్లాన్లు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం దేశంలో అనేక రకాల ప్రయాణ బీమా పాలసీలు అందుబాటులో ఉన్నప్పటికీ అవన్నీ పరస్పరం భిన్నమైనవే. దీంతో తమకు అనువైన పాలసీని ఎంచుకోవడం వినియోగదారులకు కష్టంగా మారింది.
ఈ నేపథ్యంలో సామాన్య ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఒకే విధమైన కవరేజీ ఫీచర్లతో ప్రామాణిక ప్రయాణ బీమా పాలసీని రూపొందించినట్లు ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. ఈ పాలసీని తీసుకొని ప్రయాణ సమయాల్లో గాయపడిన వారికి రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు.. ప్రయాణాల్లో మరణించిన వారికి రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు కవరేజీ లభిస్తుందని వెల్లడించింది. ప్రయాణాలు రద్దయినా లేక మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైన సందర్భాలతోపాటు ప్రయాణ సమయాల్లో లగేజీ పోగొట్టుకున్నవారికి, ఫ్లైట్లు మిస్సయినవారికి కూడా ఈ పాలసీ రక్షణకల్పిస్తుందని ఐఆర్డీఏఐ వివరించింది.