హైదరాబాద్: గులాబ్ తుఫాను ఆదివారం రాత్రి తీరం దాటింది. దీని ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీగా వర్షం కురుస్తున్నది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుఫాను ప్రభావంతో సోమవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురుస్తున్నది.
గులాబ్ తుఫాను రాష్ట్రంలో సోమవారం కుంభవృష్టి, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిస్థితిపై సమీక్షించారు. కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తుపాను నేపథ్యంలో రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారిమళ్లించింది. విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 1912, 100 టోల్ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.