న్యూఢిల్లీ : కరోనా తీవ్రత దృష్ట్యా గర్భిణి ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హాస్పిటల్స్ అన్ని కరోనా రోగులతో నిండిపోవడం, ఆక్సిజన్ కొరత ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గర్భిణి ఉద్యోగుల పట్ల కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే గర్భిణి ఉద్యోగులు, మానసిక వికలాంగులైన ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతరులైన 50 శాతం ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు హాజరు అవ్వాలని సూచించింది. ఈ నిబంధనలు మే 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్న ఉద్యోగులకు 50 శాతం అటెండెన్స్ నుంచి మినహాయించారు. వీరంతా టెలిఫోన్తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉండాలని కేంద్రం ఆదేశించింది.