కుండపోత వర్షాలు రాష్ర్టాన్ని ముంచెత్తాయి. సోమవారం సాయంత్రం నుంచి తెల్లవారుజాముదాకా తెరిపియ్యకుండా వానలు దంచికొట్టాయి. వరంగల్ జిల్లా నడికుడలో అత్యధికంగా 38.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలమైంది. కార్మిక క్షేత్రం సిరిసిల్ల జల దిగ్బంధంలో చిక్కుకున్నది. సిరిసిల్ల కలెక్టరేట్ గేట్లు కూడా తెరిచే వీలులేకపోయింది. వర్షాలధాటికి వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లడంతో పంటలు నీట మునిగిపోయాయి. మూడ్రోజులపాటు పొడివాతావరణం ఉంటుందని వాతావరణశాఖ ప్రకటన కొద్దిగా తెరిపిచ్చినా.. 11న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్న వార్త గుబులు రేపుతున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కుంభవృష్టి కురిసింది. అత్యంత భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. సోమవారం రాత్రి నుంచి తెల్లవార్లూ ప్రమాదకరస్థాయిలో వర్షం కురిసింది. సిరిసిల్లను వరదనీరు ముంచెత్తింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోడ్లు నదులను తలపించాయి. వాగులు, వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్లో ప్రధానరహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది. 30 ఏండ్ల తర్వాత ఇంత భారీ వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. సిరిసిల్ల కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్ద నడుము లోతు నీరు చేరింది. కలెక్టరేట్ గేట్లు కూడా తెరవని పరిస్థితి నెలకొనడంతో అధికారులంతా బయటే ఉండి, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వరదలో చిక్కుకున్న ప్రజలకు సహాయ చర్యలు చేపట్టాలని మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్సు ద్వారా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం అనంతారం వద్ద సదాజల వాగు ఉప్పొంగడంతో, నిజామాబాద్-జగ్దల్పూర్ మధ్య ఉన్న జాతీయ రహదారిపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, తెలంగాణ రాష్ర్టాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో అత్యధికంగా వరంగల్ జిల్లా నడికుడలో 38.80 సెం.మీ., కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం మల్యాలలో 30.28 సెం.మీ. వర్షం కురిసింది. 19 ప్రాంతాల్లో 20 సెం.మీ., 25 ప్రాంతాల్లో 15 సెం.మీ.లకుపైగా వర్షపాతం నమోదైంది. 86 ప్రాంతాల్లో వర్షపాతం 10 సెం.మీ. దాటింది. వరంగల్లో పలు కాలనీలు నీట మునిగాయి. ఎన్టీఆర్నగర్, పద్మావతినగర్లోని జలదిగ్బంధంలో చిక్కుకున్న సుమారు 150 మంది ప్రజలను డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లు, లైఫ్ జాకెట్లతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షానికి ప్రభావితమైన జిల్లాల్లో ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
24 జిల్లాలు ప్రభావితం
రాష్ట్రంలో 24 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. హనుమకొండ, వరంగల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత భారీ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సిద్దిపేట, ఖమ్మం, పెద్దపల్లి, కామారెడ్డి, అదిలాబాద్, మెదక్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, సూర్యాపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో విస్తారంగా పడ్డాయి. మంగళవారం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో13 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసినట్టు టీఎస్డీపీఎస్ పేర్కొన్నది. బుధవారం ఉదయం 8.30 గంటల వరకు పలు జిల్లాల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీచేసింది.
మూడ్రోజులు పొడి వాతావరణం
సోమవారం సాయంత్రం నుంచి ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం మంగళవారం సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. బుధ, గురు, శుక్రవారాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. అయితే, ఈ నెల 11న ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వెల్లడించారు. అలాగే దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలు, దక్షిణ ఒడిశా ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నదని, దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్రమట్టం నుంచి 7.6 కిలో మీటర్ల వరకు కేంద్రీకృతమై ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశవైపునకు వంపు తిరిగి స్థిరంగా కొనసాగుతున్నదని తెలిపారు. ఈ అల్పపీడనం రాగల రెండు మూడ్రోజుల్లో పశ్చిమ- వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉన్నదని చెప్పారు. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ 7 వరకు సాధారణం కంటే 37% అధికంగా వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ తెలిపింది. అలాగే గతేడాది కంటే 2 శాతం ఎక్కువగా వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం 627.7 మిల్లీ మీటర్లు కాగా గతేడాది 839 మిల్లీమీటర్లు, ఈ ఏడాది 859.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కరెంట్కు ఆటంకం లేదు
వైర్లకు దూరంగా ఉండాలి: సీఎండీ ప్రభాకర్రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యుత్తు సరఫరా అవుతున్నదని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపత్తుల నుంచి రక్షణగా ముందస్తుగానే బొగ్గు నిల్వ చేసుకున్నామని తెలిపారు. డిస్కంల సీఎండీల సమన్వయంతో 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యుదుత్పత్తి, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పవర్గ్రిడ్ను మెయింటెన్ చేస్తున్నామని అన్నారు. ప్రజలెవరూ స్తంభాలు, విద్యుత్ వైర్లను తాకొద్దని సీఎండీ సూచించారు. వర్షాల నేపథ్యంలో ఇంజనీర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన జాగ్రత్తలు, సూచనలు అందజేస్తున్నామని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. విద్యుత్తుకు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 1912/ 100/ స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్తోపాటు విద్యుత్తుశాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574 కు ఫోన్ చేసి గానీ, సంస్థ మొబైల్యాప్, ట్విట్టర్, ఫేస్బుక్ల ద్వారా ఫిర్యాదుచేయాలని సూచించారు. భారీవర్షాల నేపథ్యంలో సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ మంగళవారం మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
భయం వద్దు: డీజీపీ ట్వీట్
వరదల్లో చిక్కుకున్నవారికి సాయం అందించేందుకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీజీపీ ఎం మహేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. ముంపులో ఉన్నవారంతా వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోండి.. అత్యవసరమైతే డయల్ 100కు సమాచారం ఇవ్వండి’అని మంగళవారం ట్వీట్ చేశారు.
జాగృతి ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ
వర్షాలతో నిరాశ్రయులైనవారికి తెలంగాణ జాగృతి అండగా నిలిచింది. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదేశాలతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో పేదలకు జాగృతి ప్రతినిధులు చేయూతనిచ్చారు. మంగళవారం రాత్రి 500 మందికి దుప్పట్లు, ఆహారాన్ని అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు, జాగృతి ప్రతినిధులు పాల్గొన్నారు.