22 ఎకరాల్లో సాగు.. యేటా రెండు పంటలు..
2.5 కిలోమీటర్లు పైప్లైన్ వేసి నీటి సరఫరా
ప్రతి సీజన్లో 50 మందికిపైగా కూలీలకు ఉపాధి
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై సాగు వైపు..
రైతుబంధు, ఉచిత కరెంట్, సబ్సిడీపై పరికరాలు..
సాగులో రాణిస్తున్న కుశ్నపల్లికి చెందిన రాజేశ్
బెజ్జూర్, ఏప్రిల్ 13:కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కుశ్నపల్లి గ్రామానికి చెందిన గడ్డం రాజేశ్ సిమెంట్ సబ్ డీలర్గా వ్యాపారం చేస్తున్నాడు. ఆరేండ్లు చేసిన వ్యాపారంలో లాభం అంతంత మాత్రంగానే రావడంతో ప్రత్యామ్నాయ రంగాల వైపు దృష్టి సారిం చాడు. తనకు 22 ఎకరాల భూమి ఉండడం, తెలంగాణ సర్కారు చేపడుతున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరంటు, సబ్సిడీపై పరికరాల వంటి వాటికి ఆకర్షితుడై వ్యవసాయం చేయాలని నిర్ణయిం చుకున్నాడు. నాలుగేండ్లుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి వివిధ పంటలు సాగు చేస్తున్నాడు. ఆధునిక సాగు పద్ధతులు అవలంబిస్తూ మంచి దిగుబడి సాధి స్తున్నాడు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
రాజేశ్ స్థానిక పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివాడు. తనకు తోచిన ఆలోచనలతో సాగు మొదలు పెట్టాడు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్పై కొత్త పద్ధతిని అవలంబించాడు. బెజ్జూర్ మండలం కుశ్నపల్లికి సమీపంలో ప్రవహిస్తున్న వాగుపై దృష్టి సారించాడు. వాగులో 3 ఫిల్టర్ బోర్లు అమర్చి వాటికి విద్యుత్ కనెక్షన్లతో సుమారు 2.5 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ పైప్లైన్ వేశాడు. పిల్ల తోవలు, ఎడ్లబండ్లు వెళ్లే తాత్కాలిక రహదారుల నుంచి పైప్లైన్ వేసి సాగునీరు సరఫరా జరిగేలా చూస్తున్నాడు. త్రీఫేజ్ వ్యవసాయ కనెక్షన్లను నాలుగు చోట్ల ఏర్పాటు చేశాడు. వీటితోపాటు సర్కారు సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. 90శాతం సబ్సిడీపై ట్రాక్టర్, పవర్ ఈడర్లను తీసుకున్నాడు. సొంత ఖర్చులతో రూ.3 లక్షలు వెచ్చించి మూడు, ఉపాధిహామీలో నాలుగు వ్యవసాయ బావులు తవ్వించాడు. నీటికి ఢోకా లేకుండా ఏర్పాట్లు చేసుకున్న రాజేశ్ తనకున్న 22 ఎకరాల్లో రెండెకరాల్లో మిర్చి, రెండెకరాల్లో మక్క, రెండెకరాల్లో పసుపు, 14 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. పంటలపై పూర్తి అవగాహన లేకున్నప్పటికీ మిర్చి సాగుపై ఖమ్మం, వరంగల్ జిల్లాలకు వెళ్లి మెళకువలు నేర్చుకున్నాడు. అదేవిధంగా పసుపు గురించి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వెళ్లాడు. వరి గురించి వ్యవసాయ అధికారులను సంప్రదిస్తూ సూచనలు, సలహాలు తీసుకుంటూ సాగులో రాణిస్తున్నాడు. మిర్చి ఎకరాకు 25-30 క్వింటాళ్లు, మక్కలు 15-20, వరి వానకాలంలో 20-24, యాసంగిలో 25-28, పసుపు 25 క్వింటాళ్లు పండిస్తున్నాడు. దీంతో మొత్తం రూ.14 లక్షల నుంచి రూ.16 లక్షలవరకు ఆదాయం వస్తుండగా.. పెట్టుబడి పోనూ ఏడాదికి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లాభం వస్తున్నది.
50 మంది కూలీలకు సీజనంతా పని..
22 ఎకరాల్లో సాగు చేస్తున్న రాజేశ్కు భూమి చదును మొదలు పంటలు ఇంటికి చేరే వరకు చేతి నిండా పని ఉంటున్నది. దీంతో తనతో పాటు మరో 50 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాడు. వానకాలం, యాసంగి సీజన్లలో 50 మంది కి చేతినిండా సీజనంతా కూడా పని కల్పిస్తున్నాడు. దీంతో మంచి దిగుబడిని పొందుతున్నాడు. ఒక వైపు ప్రభుత్వ పథకాలు, మరో వైపు సబ్సిడీ పనిముట్లు, అన్నింటినీ అందిపుచ్చు కుంటూ సాగులో రాణిస్తున్న రాజేశ్ రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.