న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంపై కేంద్ర సర్కారు సమీక్ష నిర్వహించింది. గత వారం రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు అతిగా నమోదవుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రెటరీలతో కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా పాజిటివ్ కేసుల నిర్ధారణ కోసం పరీక్షల నిర్వహణను వేగవంతం చేయాలని, పాజిటివ్ వచ్చిన వారి క్లోజ్ కాంటాక్ట్స్ను వేగంగా ట్రేస్ చేసి వెంటనే ఐసోలేషన్లో పెట్టాలని ఈ సందర్భంగా రాజీవగౌబా వివిధ రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలకు సూచించారు.
ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలతోపాటు, జమ్ముకశ్మీర్ చీఫ్ సెక్రెటరీ కూడా కేంద్ర క్యాబినెట్ సెక్రెటరీతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. గత వారం రోజులుగా ఆయా రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో వారితో క్యాబినెట్ సెక్రెటరీ సమావేశమై సమీక్ష నిర్వహించారు.