హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 21 (నమస్తే తెలంగాణ): బ్లాక్ ఫంగస్ హడలెత్తిస్తున్నది. కరోనా చికిత్స క్రమంలో ఈ మహమ్మారి దాడి చేస్తుండటంతో వ్యాధి లక్షణాలున్నవారు కోఠి ఈఎన్టీ దవాఖానకు పరుగులు పెడుతున్నారు. దీంతో గత మూడ్రోజుల నుంచి ఈ దవాఖానకు వస్తున్న అవుట్ పేషెంట్ల (ఓపీ) సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. గత రెండు రోజులుగా సరాసరి 300 మంది ఈ దవాఖానను ఆశ్రయించారు. మరోవైపు వైద్యులు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ బారిన పడినవారిని గుర్తించి వెంటనే దవాఖానలో అడ్మిషన్లు ఇస్తున్నారు. ఈ నెల 20వ తేదీన నమోదైన 284 ఓపీల్లో 39 మందికి ఇన్పేషెంట్లుగా అడ్మిషన్ఇవ్వగా.. శుక్రవారం నమోదైన 305 ఓపీల్లో వ్యాధి నిర్ధారణ జరిగిన 22 మందికి అడ్మిషన్ ఇచ్చారు. గత రెండ్రోజుల వ్యవధిలో వచ్చిన ఓపీల్లో పురుషులు 310 మంది, మహిళలు 279 మంది ఉన్నారు. ఈ రెండ్రోజుల్లో వ్యాధి నిర్ధారణ అయిన 61 మందిలో 47 మంది పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారు. ప్రస్తుతం ఈ దవాఖానలో 112 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు ఇన్పేషెంట్లుగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. కోఠి ఈఎన్టీ దవాఖానలో బ్లాక్ ఫంగస్ రోగులకు వైద్యులు శస్త్ర చికిత్స కూడా నిర్వహిస్తున్నారు. గత రెండ్రోజుల్లో 12 మందికి శస్త్ర చికిత్స నిర్వహించారువారం, పదిరోజుల్లో గుర్తింపు
బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారంతా కొవిడ్ బాధితులే. వీరిలో కరోనా పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతున్న వారం, పది రోజుల్లో బ్లాక్ ఫంగస్ లక్షణాలు గుర్తించినవారే అధికంగా ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని కోఠి ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ రవిశంకర్ తెలిపారు. ముంబైలోని పరెల్స్ గ్లోబల్ దవాఖానలో జరిగిన ఒక సర్వేలో 32 మంది బ్లాక్ ఫంగస్ రోగులను పరిశీలించగా.. కొవిడ్ వచ్చి చికిత్స పొందుతున్న పదో రోజు బ్లాక్ ఫంగస్ బారిన పడినట్టు తేలింది.
బ్లాక్ ఫంగస్ బారిన పడినవారిలో ప్రధానంగా చెంపవాపు, కంటివాపు లాంటి లక్షణాలు ఉంటాయని, కానీ ఈ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ బ్లాక్ ఫంగస్ సోకినట్టు కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రైవేటు దవాఖానల్లో ఈ లక్షణాలున్నవారికి ఆంఫోటెరిసిన్ అనే యాంటీ ఫంగస్ ఇంజెక్షన్లను యథేచ్ఛగా ఇస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఈ ఇంజెక్షన్ వాడితే మూత్రపిండాలు, కాలేయంపై దుష్ప్రభావం పడుతుందని చెప్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని నెఫ్రాలజీ, ఎండోక్రనాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుల సూచనల మేరకు నిర్ణీత పరిమాణంలోనే ఈ ఇంజెక్షన్లు వినియోగించాలని సూచిస్తున్నారు.