న్యూఢిల్లీ: మహామహులకు రాజకీయ జీవితాన్ని ఇచ్చి, ఎంతోమంది రాజకీయ ఉద్ధండులను తయారుచేసిన పార్టీ.. 60 ఏండ్ల పాటు దేశాన్ని ఏలిన పార్టీ కాంగ్రెస్. ఇదంతా ఒకప్పుడు. కానీ, ఇప్పుడు ఏ ఎన్నికైనా సరే ఓటమే. పార్టీకి సరైన నాయకత్వం లేకపోవటం కాంగ్రెస్ను కుంగదీస్తున్నది. దిశానిర్దేశం చేసే నాయకుడు లేకపోవటంతో కిందిస్థాయి నేతలు ఢీలా పడిపోయారు. 2014 తర్వాత పంజాబ్ ఎన్నికలు తప్ప చెప్పుకోదగ్గ గెలుపు ఒక్కటీ లేదంటేనే ఆ పార్టీ పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను కూడా ఢీకొట్టే స్థితిలో లేని పార్టీ.. నాయకత్వమే లేని పార్టీ.. పార్టీని, శ్రేణులను నడిపించే నాయకుడు లేని పార్టీ.. ఆ పార్టీ పేరెత్తితేనే రాజకీయ విశ్లేషకులు అంటున్న మాటలివి. గెలుపు అంటే ఆమడదూరం పారిపోతున్న దారుణ స్థితిలో ఈ పార్టీ ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ ఎన్నికైనా సరే ఫలితం వచ్చేవరకు అవసరం లేదు, ఎలాగూ గెలవం అని ఆ పార్టీ నేతలు ముందే ఫిక్సయిపోతున్నారని చెప్తున్నారు. ప్రతి ఎన్నికలోనూ ప్రత్యర్థి పార్టీలకు దీటుగా నిలబడాల్సింది పోయి ఓటమిని ఒప్పుకొని పక్కకు జరుగుతున్న పరిస్థితులు ఆ పార్టీలో ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికలు, పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి పరాభవమే ఎదురైందని అంటున్నారు. ‘కాంగ్రెస్లో సమస్యలున్నాయి. వాటిని ఆ పార్టీ అవగతం చేసుకోవాలి’ అని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ. 2019 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం తర్వాత పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకొన్నారు. అప్పటినుంచి పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నదని, తాజాగా 5 రాష్ర్టాల్లోనూ కాంగ్రెస్ పోటీ ఇవ్వకపోవటం ఆ పార్టీ దయనీయ స్థితిని తెలియజేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ పార్టీ గెలుపు అన్న మాటనే మర్చిపోయిందా! అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కేరళ(మొత్తం సీట్లు 140)
సీపీఐఎం 62 +4
సీపీఐ 17 -2
కాంగ్రెస్ 21 -1
ఐయూఎంఎల్ 15 -3
బీజేపీ 0 0
ఎల్డీఎఫ్ కూటమి 99
యూడీఎఫ్ కూటమి 41
అస్సాం (మొత్తం సీట్లు 126)
బీజేపీ 60 60
కాంగ్రెస్ 29 +3
ఏఐడీయూఎఫ్ 16 +3
ఏజీపీ 9 -5
బీజేపీ కూటమి 77
కాంగ్రెస్ కూటమి 45
పుదుచ్చేరి(మొత్తం సీట్లు 30)
ఏఐఎన్ఆర్సీ 10 +2
బీజేపీ 6 +6
కాంగ్రెస్ 2 -13
డీఎంకే 6 +4
ఏఐఏడీఎంకే 0 -4
బీజేపీ కూటమి 16
కాంగ్రెస్ కూటమి 8
ఎన్నార్ కాంగ్రెస్కు 10, బీజేపీకి 6 సీట్లు
ఒక్క సీటూ దక్కని అన్నాడీఎంకే
పుదుచ్చేరి, మే 2: పుదుచ్చేరిలో ఆలిండియా ఎన్నార్ కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ అధికారం చేపట్టడానికి రంగం సిద్ధమైంది. మొత్తం 30 స్థానాలకు ఏఐఎన్ఆర్సీ కూటమి 16 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఎనిమిది స్థానాల్లో గెలిచింది. ఇండిపెండెంట్లు ఆరు స్థానాల్లో గెలిచారు. సీట్ల పరంగా చూస్తే, ఏఐఎన్ఆర్సీకి 10 సీట్లు రాగా.. మిత్రపక్షం బీజేపీకి 6 సీట్లు దక్కాయి. కాంగ్రెస్కు 2 సీట్లు దక్కగా.. మిత్రపక్షం డీఎంకేకు 6 స్థానాలు లభించాయి. తట్టన్చవడి స్థానం నుంచి ఎన్నార్ కాంగ్రెస్ అధినేత, మాజీ సీఎం ఎన్ రంగస్వామి గెలుపొందారు. మరోవైపు, పోటీ చేసిన 5 స్థానాల్లోనూ అన్నాడీఎంకే అభ్యర్థులు ఓడిపోయారు. పుదుచ్చేరిలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లభించకపోవడం 1980 తర్వాత ఇదేతొలిసారి.