హైదరాబాద్, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. గురువారం 1.30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో తగ్గడంతో ఎస్సారెస్పీ గేట్లను గురువారం మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 6,720 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్న ది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091అడుగులు (90.313 టీఎంసీలు)కాగా గురువారం సాయంత్రానికి 1,090.7 అడుగుల (88.662 టీఎంసీలు) నిల్వ ఉన్న ది. కృష్ణాలోనూ స్వల్పంగా వరద వచ్చిచేరుతున్నది. జూరాలకు 30వేలు, శ్రీశైలానికి 49 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది.
3 గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల
వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి క్రమంగా ఇన్ఫ్లో తగ్గుతున్నది. ప్రాజెక్టులోకి గురువారం 5918.46 ఇన్ఫ్లో కొనసాగింది. 3 క్రస్ట్ గేట్ల ద్వారా 5,775 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 643.25 అడుగులు (4.00 టీఎంసీలు) ఉన్నట్టు అధికారులు తెలిపారు.