నమస్తే తెలంగాణ నెట్వర్క్: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన శ్రీరాంసాగర్కు వరద కొంతమేర తగ్గినా.. దిగువన భద్రాచలం వద్ద పోటెత్తుతున్నది. ప్రాణహిత, మానేరు, ఇంద్రావతితోపాటు స్థానిక వాగుల నుంచి భారీగా వరద వచ్చి గోదావరిలో చేరుతున్నది. దీంతో భద్రాచలం వద్ద నుంచి సుమారు 14 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. ప్రవా హం 24 గంటలపాటు ఇలాగే కొనసాగితే సుమారు 100 టీఎంసీలకు పైగా నీళ్లు ఒక్కరోజులోనే గోదావరి దిగువకు వెళ్లిపోయినట్టని అధికారులు వివరిస్తున్నారు. ప్రస్తుతం గోదావరి ప్రవాహ నీటి మట్టం 49 అడుగులకు చేరుకోగా భద్రాచలంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు.
ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, రా ష్ట్రంలోని క్యాచ్మెంట్ ఏరియాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. ఆల్మట్టి, నారాయణపుర, జూరాల దాటుకొని శ్రీశైలానికి ఉరకలేస్తున్నది. శనివారం సాయంత్రం జూరాలకు దాదాపు 3.30 లక్షల ఇన్ఫ్లో నమోదవ్వగా.. 41 గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా అధికారులు దిగువకు 3.41 లక్షల క్యూసెక్కులను వదిలారు. కృష్ణా జలాలకుతోడు తుంగభద్ర నుంచి వస్తున్న వరదతో శ్రీశైల జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ఇక్కడి నుంచి నాగార్జున సాగర్కు 29 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. తుంగభద్ర డ్యాం నిండుకుండలా మారడంతో ఏ క్షణమైనా గేట్లు తెరిచే అవకాశమున్నది. నదీ సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
రాష్ట్రంలో వాన తగ్గుముఖం పట్టింది. అల్పపీడనం బలహీనపడటంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు మినహా వాతావరణం పొడిగా మారింది. రాష్ట్రంలో ఆది, సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు.. నిజామాబాద్, జనగామ, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోస్రాలో 9.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోల్కొండలో 8.9 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్దవ్మంతల్లో 7.4, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండ లం సోనాలలో 7.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.