విద్యానగర్, మే 7: ఇంటింటా జ్వర సర్వేలో ఏ ఒక్క ఇల్లు కూడా మిగులొద్దని, ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యులందరి ఆరోగ్య వివరాలు నమోదు చేయాలని కామారెడ్డి కలెక్టర్ శరత్ వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్వోలు, ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లతో ఇంటింటా జ్వర సర్వేను పీహెచ్సీల వారీగా శుక్రవారం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సర్వే నిర్వహించే బృందాలకు మెడికల్ కిట్లలోని మందుల వాడకం, ఎవరికి స్టెరాయిడ్స్ అందించాలనే అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండేలా సరైన శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. క్లస్టర్ ఏరియా, సబ్ సెంటర్లలో హెల్త్ సూపర్వైజర్లకు బృందాల బాధ్యత అప్పగించాలని, తమ సర్వేలో ఒక్క ఇల్లు కూడా మిస్ కావొద్దని, ఇంట్లోని కుటుంబసభ్యులందరి ఆరోగ్య పరిస్థితులను రిజిస్టర్లలో నమోదు చేయాలని, అనారోగ్య లక్షణాలు, అందించిన కిట్స్ వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో నమోదు చేయాలని అన్నారు.
ఏఎన్ఎం, ఆశ సిబ్బంది నమోదు చేసిన వివరాలను మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ సూపర్వైజర్లు పరిశీలించుకోవాలని ఆదేశించారు. లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ ఐసొలేషన్ కిట్లు ముందుగా అందించాలని, హోం ఐసొలేషన్ వసతి లేనివారిని తప్పనిసరిగా ప్రభుత్వ కొవిడ్ సెంటర్లో చేర్పించి చికిత్స అందించాలని తెలిపారు. హోం ఐసొలేషన్లో ఉన్న వారు రోజూ మందులు వేసుకుంటున్నదీ.. లేనిది, బాధితులు బయటికి వెళ్తున్నారా అనే విషయాలను పరిశీలించాలన్నారు. దవాఖానలో బెడ్లు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన వారికి వసతి కల్పించాలని తెలిపారు. వైద్య సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని సూచించారు. 45ఏండ్లు పైబడి, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని తెలిపారు. అన్ని దవాఖానల్లో ఓపీ సేవలందించాలన్నారు. డోంగ్లీ, మద్నూర్ మెడికల్ ఆఫీసర్లతో మాట్లాడుతూ సరిహద్దు గ్రామాల్లో ఎలాంటి సమస్యలు రాకుండా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. పాజిటివ్ రేటు తగ్గించి ప్రజల ఆరోగ్యస్థితిని మెరుగుపరిచేందుకు సమష్టిగా పని చేయాలని కోరారు.