హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): భారతీయుల్లో మధుమేహం, స్థూలకాయ సమస్యలు క్రమంగా పెరిగిపోతున్నాయని, జీవన విధానంలో మార్పులు చేసుకొని వాటిని అధిగమించవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. తెలంగాణ అమెరికా సంఘం శనివారం ‘రివర్సింగ్ డయాబెటిస్ అండ్ ఒబెసిటీ విత్ లైఫ్ైస్టెల్ చేంజెస్’ పేరిట వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. అమెరికన్ బోర్డ్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ డిప్లొమాట్ డాక్టర్ నందిని సుంకిరెడ్డి మాట్లాడారు. మధుమేహం, స్థూలకాయానికి గురికాకుండా ఉండటం, వచ్చినా తగ్గించుకోవటం మన చేతుల్లోనే ఉంటాయని అన్నారు. ఔషధాల కంటే ఆహారపు అలవాట్లు, నిద్ర సమయాల్లో మార్పులు, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో అమెరికాలో ఫలితాలు సాధించామని, ఆరునెలల్లోనే ఎంతోమంది ఆరోగ్యవంతులు అవుతున్నారని ఆమె చెప్పారు. చిన్న వయస్కులకూ స్థూలకాయం, మధుమేహ సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫాస్ట్ఫుడ్కు దూరంగా ఉండటం, నాణ్యత గల వంటనూనె వినియోగం, సరిపడా నిద్ర ఉండేలా చూసుకోవటం ముఖ్యమని డాక్టర్ నందిని పేర్కొన్నారు.