హైదరాబాద్ : రాష్ట్రంలోని పోలీసు కమిషనర్ల కార్యాలయాలు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ల కార్యాలయంలో ఆరోగ్య పర్యవేక్షణ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. బుధవారం పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా డీజీపీ ఈ నిర్ణయం వెలువరించారు. పోలీసు సిబ్బంది భద్రత కోసం ఈ విభాగం ప్రాధాన్యతనిస్తోందన్నారు. వారిలో విశ్వాసం, సానుకూలత పెంపొందించేందుకు జూమ్ సమావేశాల ద్వారా వారితో సంభాషించడానికి ప్రతి విభాగంలో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ బృందంలోని రోగులకు సీనియర్ అధికారులు, స్టేషన్ హౌస్ అధికారులు, వైద్యులు తగిన సలహా ఇస్తారన్నారు. అదేవిధంగా కొవిడ్ కిట్లు, డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. పోలీసు విభాగంలోని ప్రతి ఒక్క సిబ్బంది హెల్త్ ప్రొఫైల్ను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించిన డీజీపీ ఏవైనా సమస్యలు ఎదురైతే రోగులను సమీప ఆస్పత్రికి తరలించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా పేర్కొన్నారు.