హైదరాబాద్: ప్రైవేట్ దవాఖానల కరోనా చికిత్సల లైసెన్సులను వైద్యారోగ్య శాఖ పునరుద్ధరించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నందుకుగాను గతంలో 22 హాస్పిటళ్లలో కరోనా చికిత్స లైసెన్సులు రద్దు చేసిన విషయం తెలిసిందే. తిరిగి ఆ దవాఖానలకు లైసెన్సులు జారీచేసింది. అదేవిధంగా సికింద్రాబాద్ కిమ్స్, గచ్చిబౌలి సన్షైన్, లక్డీకాపూల్లోని లోటస్ దవాఖానపై చర్యలను నిలిపివేసింది. వాటిలో కరోనా చికిత్సలకు అనుమతులు పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా చికిత్సలకు ఆటంకం కలగవద్దనే చర్యలు నిలిపివేసినట్టు ఉత్తర్వుల్లో డీహెచ్ శ్రీనివాస రావు వెల్లడించారు. అధికంగా వసూలు చేసిన సొమ్మును రెండు వారాల్లో బాధితులకు తిరిగి చెల్లించాలని ఆదేశించారు. మరోసారి అధిక చార్జీలు వసూలు చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. హాస్పిటల్ లైసెన్సు రద్దు చేసి యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.