మల్కాజిగిరి, మే 4: రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఇంటింటికీ వెళ్లి జ్వర లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి మందులు ఇండ్లవద్దనే ఇవ్వాలని.. రోజుల తరబడి జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలతో బాధపడుతున్న వారిని కరోనా లక్షణాలుగా గుర్తించి వారిని ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాలకు సిఫారసు చేయాలన్న ఆదేశాలతో జంట నగరాల్లోని అన్ని సర్కిళ్లలోనూ మంగళవారం నుంచి ఇంటింటి జ్వర పీడితుల సేకరణను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి, అల్వాల్, సికింద్రాబాద్ సర్కిళ్లలో మంగళవారం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వేను ప్రారంభించింది.
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో ఇంటింటి సర్వేకు గాను 18 టీంలను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ ఆనంద్ తెలిపారు. ఇందులో ఏఎన్ఎంలు. ఆశవర్కర్లు, మలేరియా సిబ్బంది ఉంటారని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి ఇంట్లో ఎంతమంది సభ్యులున్నారు. వారిలో ఎవరైన జ్వరంతో బాధపడుతున్నారా, ఎక్కువ రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారా అన్న వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.
మామూలుగా జ్వరంతో బాధపడుతున్న వారికి మందులు ఇంటివద్దే ఇస్తున్నామని, ఎక్కువ రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వారిని ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాలకు పంపుతున్నామని తెలిపారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో మొదటి రోజున 873 ఇండ్లలో ఈ సర్వే నిర్వహించామని అన్నారు. ఇందులో 98 మంది జ్వరంతో బాధపడుతున్నట్లుగా గుర్తించి వారికి మందులు ఇచ్చినట్లు చెప్పారు.
వినాయక్నగర్, మే 4: అల్వాల్ సర్కిల్ పరిధిలోని ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ డా.తిప్పర్తి యాదయ్య మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే కోసం 12టీంలను ఏర్పాటు చేశామని అన్నారు. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఎంటమాలజీస్ట్లు, శానిటరీ వర్కర్లు, బస్తీ దవాఖాన సిబ్బంది, అల్వాల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అర్బన్ హెల్త్ సెంటర్ల సిబ్బందితో కలిసి సర్వే నిర్వహిస్తున్నామని అన్నారు. 322 ఇండ్లను సర్వేచేయడంతో 86మంది జలుబు, జ్వరం లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని అన్నారు.
సికింద్రాబాద్, మే 4: సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో కరోనా తీవ్రతరం కాకుండా అధికారులు చర్యలు ప్రారంభించారు. సర్కిల్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి కరోనా వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నారు. సర్కిల్ పరిధిలో 79 బృందాలు సర్వే జరుపుతున్నారు. మంగళవారం 7191 నివాసాల్లో సర్వే జరిపారు. 109 మంది జ్వరం ఇతర లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. 116 మంది పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సర్వేలో తేల్చారు.
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఏఎన్ఎం, ఆశవర్కర్లు మీ ఇండ్ల వద్దకే వచ్చి వివరాలు సేకరిస్తారని, ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నా.. ఎక్కువ రోజులుగా జ్వరం, దగ్గు, జలుబు లాంటి కరోనా లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నా.. వివరాలు ఇచ్చినట్లయితే మీకు సహాయం చేస్తారని ఐసొలేషన్ కేంద్రాలకు తరలిస్తారని ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకుని కరోనా నుంచి కాపాడుకోవాలి. – డీసీ దశరథ్
కరోనా నివారణ చర్యల్లో భాగంగా సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపాకాలు లాంటి సమాచారంతో పాటు జలుబు, జ్వరం, ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయోమోనని వివరాలు సేకరించి రిపోర్టు తయారు చేస్తారు. వైద్య సిబ్బందికి వివరాలను అందజేసి వైద్య సేవలకు తోడ్పతాం – పల్లె మోహన్రెడ్డి, డిప్యూటీ కమిషనర్