న్యూఢిల్లీ: మీరు ఇంటి రుణం తీసుకోవాలని ప్రణాళిక రూపొందించుకున్నారా..?! అయితే, ఇదే మంచి తరుణం..!! మార్కెట్లో డిమాండ్ను ప్రోత్సహించేందుకు కొన్ని రోజులుగా పలు బ్యాంకులు ఇంటి రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తన ఖాతాదారులకు ఇంటి రుణాలపై ఐదు బేసిక్ పాయింట్లు రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్పీఎల్ఆర్) తగ్గించింది.. ఈ నెల నాలుగో తేదీ నుంచి ఈ తగ్గింపు అమలులోకి వచ్చింది. అలాగే భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఇంటి రుణాలపై వడ్డీరేట్లను తగ్గించి వేశాయి.
అయితే, ఇంటి రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు కొత్త రుణ గ్రహీతలకే వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇంటి రుణం తీసుకున్న రుణ గ్రహీతలకు ఈ బెనిఫిట్లు లభించబోవని అంటున్నారు. ఒకవేళ భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) రెపొరేట్ తగ్గిస్తే మాత్రం ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి లబ్ధి చేకూరుతుందంటున్నారు.
ఇంటి కొనుగోలు లేదా నిర్మాణానికి తీసుకున్న హౌసింగ్ లోన్ తీసుకున్న మొత్తంలో రూ.1.5 లక్షలకు ఐటీ చట్టంలోని 80సీ కింద మినహాయింపు ఉంటుంది. ఒకవేళ కొనుగోలు చేసిన ఐదేండ్లలో ఇల్లు అమ్మేస్తే మాత్రం మినహాయించిన పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తి బదిలీకి సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు, ఇతర ఖర్చులపై తొలి ఏడాదిలో రూ.1.5 లక్షల వరకు 80సీ కింద మినహాయింపునిస్తారు.
ఆదాయం పన్ను చట్టంలో 24 (బీ) సెక్షన్ కింద ప్రతి పన్ను చెల్లింపు దారు తాను చెల్లించే ఇంటిరుణ వాయిదాల్లో రూ.2 లక్షల వరకు వడ్డీపై పన్ను మినహాయింపు కోరతారు. ఇది ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాతే సదరు రుణ గ్రహీతకు వర్తిస్తుంది.
కొత్తగా ఐటీ మినహాయింపులను విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం 2017-18లో ఐటీ చట్టంలో 80ఈఈ సెక్షన్ను ప్రవేశపెట్టింది. దీని కింద రూ.50 వేల రుణంపై వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అందుకు అమలులో ఉన్న షరతులు ఇవే:
ఇదిలా ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతేడాది నవంబర్ 12వ తేదీన ఇండ్ల డెవలపర్లు, కొనుగోలు దారులకు రిలీఫ్నిచ్చే చర్యను తీసుకున్నారు. దేశంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ లావాదేవీలకు డిమాండ్ను పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు. తొలిసారి రూ.2 కోట్ల వరకు ఖర్చు చేసి ఇల్లు కొనుగోలు చేసిన వారు ఈ పథకం కింద మినహాయింపు కోరొచ్చు. వీరికి 20 శాతం వరకు ఆదాయంపన్ను రాయితీ వచ్చే జూన్ 30 వరకు అమలులో ఉంటుంది.