తొలి ప్రాధాన్య ఓటుతో పాటు ఎలిమినేషన్ రౌండ్స్లోనూ..
తర్వాత స్థానాల్లో మల్లన్న, కోదండరాం
నల్లగొండలో సుదీర్ఘంగా సాగుతున్న ఓట్ల లెక్కింపు
నేడు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం
నల్లగొండ ప్రతినిధి, మార్చి19 (నమస్తే తెలంగాణ): నల్లగొండ పట్టణంలోని స్టేట్ వేర్ హౌసింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైన వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు శుక్రవారమూ కొనసాగింది. లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. ఆ తర్వాత మొదలైన ఎలిమినేషన్ రౌండ్స్లోనూ అప్పటికే ఉన్న తొలి ప్రాధాన్య ఓట్లకు మరిన్ని ఓట్లు వచ్చి జత చేరుతున్నాయి. తొలి, ఎలిమినేషన్ రౌండ్స్లో ఓట్లతో కలుపుకుని పల్లా రాజేశ్వర్రెడ్డి 1,11,190 ఓట్లతో తన ఆధిక్యతను కొనసాగిస్తున్నారు. 55 మంది ఎలిమినేషన్ తర్వాత స్వతంత్ర అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి మల్లన్న 83,629 ఓట్లతో రెండో స్థానం, 70,472 ఓట్లతో తృతీయ స్థానంలో కోదండరాం ఉన్నారు. కాగా ఎలిమినేషన్ ప్రక్రియ కూడా సుదీర్ఘంగా కొనసాగుతున్నది. గురువారం ఉదయం 4గంటలకు మొదలైన ఎలిమినేషన్ ప్రక్రియ నేటి రాత్రికి సాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పటికీ గెలుపు కోటా ఎవరికీ రాకపోతే చివరి ఇద్దరిలో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటించనున్నారు.
‘తొలి ప్రాధాన్యత’ విశేషాలివీ..
శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఏడో రౌండ్ కౌంటింగ్తో ముగిసింది. తొలి ప్రాధాన్య ఓట్లలో మొత్తం 3,66,333 ఓట్లు చెల్లగా వాటిలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి 11,0840 ఓట్లు సాధించారు. 83,290 ఓట్లు సాధించి రెండో స్థానంలో, 70,072 ఓట్లు సాధించి కోదండరాం మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నిలిచారు.
సుదీర్ఘంగా ఎలిమినేషన్ రౌండ్స్
తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత ఎలిమినేషన్ రౌండ్ ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి పది గంటల వరకు 60 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. వీరందరినీ ఎలిమినేట్ చేస్తూ లెక్కింపు కొనసాగించేందుకు 18 గంటల సమయం పట్టింది. అధికారుల అంచనా ప్రకారం శనివారం రాత్రిలోపు తుది ఫలితం వెలువడనున్నట్లు తెలుస్తున్నది. దీనిపై రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ.. ఎలిమినేషన్ రౌండ్లో చివరిగా ముగ్గురు మిగిలితే వారిలో తక్కువ ఓట్లు వచ్చిన వారు ఎలిమినేట్ అవుతారన్నారు. ఎలిమినేషన్ రౌండ్స్లో జత అవుతున్న ఓట్ల ఆధారంగా ఆ అభ్యర్థి ఎవరనేది నిర్ధారణ కానుందన్నారు.
చెల్లని ఓట్లు 20 వేలకు పైగానే..
పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతిసారీ చెల్లని ఓట్లు భారీగా ఉంటుండడం చర్చనీయాంశంగా మారింది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసే సరికి సమయానికి కౌంటింగ్ అధికారులు 21,636 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. అంటే మొత్తం ఓట్లలో ఇది 5.57శాతంగా చెల్లనివే కావడం గమనార్హం. బరిలో ఉన్న మొత్తం 71 మందిలో 62 మంది స్వతంత్ర అభ్యర్థులకు కలిపి కేవలం 5,966 ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియలోనే విజయం సాధించడం విశేషం.