వికారాబాద్, మే 21,(నమస్తే తెలంగాణ): కొవిడ్ చికిత్సకు అనంతగిరిలోని 200 పడకల టీబీ దవాఖాన సిద్ధమవుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. దవాఖానలో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరిశీలించారు. ఆమె వెంట ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, కలెక్టర్ పౌసుమి బసు, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్గౌడ్, జడ్పీ వైస్చైర్మన్ విజయ్కుమార్, అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య ఉన్నారు. ఈ సందర్భంగా దవాఖాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా గాంధీ, వరంగల్ దవాఖానలను సందర్శించి బాధితుల్లో మనోధైర్యం, వైద్యులు, సిబ్బందిలో ఆత్మైస్థెర్యం నింపారన్నారు. వికారాబాద్ జిల్లాకు సెంట్రల్ డ్రగ్ స్టోర్ను మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
ఆర్టీపీసీఆర్ సెంటర్ త్వరలో ప్రారంభం కానుందని పేర్కొన్నారు. వికారాబాద్లో శనివారం నుంచి రూ.2500లకే సీటీ స్కాన్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ దవాఖానల్లో ఫీజుల నియంత్రణకు కలెక్టర్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన ధరలను వసూలు చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సంసిద్ధులు కావాలన్నారు. చిన్న పిల్లల కోసం కూడా ప్రత్యేక ఐసొలేషన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. టీబీ దవాఖానలో ఆక్సిజన్ బెడ్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అనంతగిరిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే తాండూరులో మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేంద్రంలో కరోనా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న వికారాబాద్ అనంతగిరిలో అన్ని వసతులతో కొవిడ్ దవాఖాన ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి సుధాకర్షిండే, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల తదితరులు పాల్గొన్నారు.