హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. మహంకాళి అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. మహంకాళిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్నారు. కాగా, అమ్మవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి మల్లారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకు ముందు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం అమ్మవారికి తొలి బోనం సమర్పించింది.
లష్కర్ బోనాలకు 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో 200 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఆలయానికి చుట్టూ కిలోమీటర్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బోనాలతో వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.