హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): బాబోయ్.. ఇదేం నరకం రా.. బయటకెళ్లకుండా ఇంట్లనే ఎన్ని రోజులుంటం.. అంటూ విసిగిపోయిన జనం ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు కదిలారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో పర్యాటక ప్రాంతాల సందర్శనకు పరుగులు తీస్తున్నారు. లాక్డౌన్తో ఇన్నాళ్లు ఇండ్లకే పరిమితమైన పిల్లలు, కుటుంబసభ్యులతో కలిసి ఓ టూర్ వేసి ఆనందంగా గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే పర్యాటక ప్రాంతాలకు క్రమంగా సందర్శకుల తాకిడి మొదలైంది. దీంతో పర్యాటకాన్ని పట్టాలెక్కించే దిశగా ఆ శాఖ చర్యలు తీసుకుంటున్నది. జలాశయాల్లో బోటింగ్, హరిత హోటళ్లు, మ్యూజియాలను తిరిగి ప్రారంభించింది. మరో రెండు, మూడువారాల్లో పర్యాటక ప్రాంతాల్లో సందర్శకుల తాకిడి సాధారణ స్థితికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నది.
సందడే.. సందడి
ప్రముఖ పర్యాటక ప్రాంతాలు సోమశిల, లక్నవరంలో ఇప్పటికే సందర్శకులు సందడి చేస్తున్నారు. ఇక్కడి హరిత హోటళ్లలో ప్రతిరోజూ గదులు నిండుతున్నాయి. గత శని, ఆదివారాల్లో మూడువేల మందికిపైగా లక్నవరాన్ని సందర్శించినట్టు అధికారులు తెలిపారు. ఈ వారం ఆ సంఖ్య ఐదువేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అక్కడికి సమీపంలోని రామప్ప, తాడ్వాయి హట్స్కు సందర్శకుల తాకిడి పెరుగుతున్నది. యాదాద్రి, వేములవాడ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో హోటళ్ల బుకింగ్ నడుస్తున్నది. దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నది. హైదరాబాద్లోని లుంబినీ పార్కు, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, చార్మినార్ తదితర ప్రదేశాల్లో సందర్శకుల సందడి కనిపిస్తున్నది. గ్రామీణ వాతావరణాన్ని తలపించే శిల్పాకళా వేదిక, అందమైన ప్రకృతి, పిల్లల ఆట పరికరాలు, బోటింగ్ వసతి కలిగిన లుంబినీ పార్కుకు రోజూ వందల మంది వస్తున్నారు.
సందర్శకుల రాక మొదలైంది
లాక్డౌన్ ఎత్తేయడంతో పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల రాక మొదలైంది. లక్నవరం, సోమశిల, లుంబినీ పార్కు తదితరాలు నిత్యం పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. ఈ రంగంపై ఆధారపడినవారికి ఇది కొంత ఊరట ఇస్తుంది. శాఖాపరంగా హోటళ్లు, బోటింగ్ ప్రారంభించాం. గోల్కొండ కోటలో ఈ శనివారం నుంచి లేజర్షో అందుబాటులోకి వస్తుంది.
– మనోహర్, టూరిజం కార్పొరేషన్ ఎండీ