హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో అడవులను 24 నుంచి 33 శాతానికి పెంచాలి. ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో, ఖాళీగా ఉన్న ప్రతి జాగాలో మొక్కలు నాటాలి. రాష్ర్టాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చాలి. ఏడేండ్లలో అనుకున్న లక్ష్యం పూర్తికావాలి’. ఈ లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. లక్ష్యం దిశగా దూసుకుపోతున్నది. ముందుగా అనుకున్నమేరకు ఈ ఏడాదితో తెలంగాణ సర్కార్ లక్ష్యం పూర్తిచేయనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం మేరకు ఇప్పటివరకు ఆరువిడతల్లో 210 కోట్ల మొక్కలు నాటడం, పునరుజ్జీవింపచేయడం పూర్తయింది. ఈ ఏడాది ఏడో విడతలో 20 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా జూలై 1వ తేదీన పల్లె, పట్టణ ప్రగతితోపాటు హరితహారం కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నది.
పక్కాప్రణాళికతో ముందుకు
హరితహారం కింద నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు మొక్కలు నాటడంలో తెలంగాణ సర్కారు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నది. మొక్కలు నాటడంపై విస్తృత ప్రచారం కల్పించడంతోపాటు అన్ని ప్రభుత్వశాఖలు, కార్యాలయాలను భాగస్వామం చేసింది. కార్పొరేట్లు, ఎన్జీవోలు, కేంద్రప్రభుత్వ కార్యాలయాలు, యువజన సంఘాలు, విద్యార్థులు, రైతులు ఇలా దాదాపు ప్రతివర్గం ప్రజలు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతనంగా తీసుకొచ్చిన పంచాయతీరాజ్, మున్సిపల్చట్టాల్లో మొక్కలు నాటడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గ్రీన్బడ్జెట్ కింద 10 శాతం ప్రత్యేక నిధులు కూడా కేటాయించింది. నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దాదాపు 85 శాతం మొక్కలు సంరక్షించబడ్డాయి. హరితహారానికి కావాల్సిన మొక్కల కోసం రాష్ట్రవ్యాప్తంగా 15,216 నర్సరీలను ఏర్పాటుచేసింది. నాటిన మొక్కలకు నీరందించేందుకు పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు సైతం అందజేసింది. నగరాలు, పట్టణాల పరిధిలో అర్బన్ఫారెస్ట్ పార్కులు ఏర్పాటుచేసింది. సద్దుదేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగేందుకు ఇప్పటివరకు రూ.5,591.51 కోట్లు ఖర్చుచేసింది.