ఘట్కేసర్, మే19: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను పోరాడి గెలిచిన విజేతలకు చప్పట్లు కొట్టి.. ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. ఆనందంగా ఇంటికి పంపారు అక్కడి వైద్యసిబ్బంది. ఐసొలేషన్కు భయంభయంగా వచ్చిన వారంతా.. చికిత్స పొంది… కొవిడ్ను జయించి..చిరునవ్వుతో స్వస్థలాలకు వెళ్లారు. అన్నోజిగూడలోని రాష్ట్రీయ విద్యా కేంద్రంలో కొవిడ్ ఐసొలేషన్ సెంటర్ నుంచి 22 మంది కోలుకొని బుధవారం ఆరోగ్యంగా ఇండ్లకు చేరుకున్నారు. ఏప్రిల్ 29న ఆర్ఎస్ఎస్,సేవా భారతి ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించగా, లక్షణాలు ఉండి, హోం ఐసొలేషన్లో ఉండేందుకు వీలుకాని పేషంట్లను గుర్తించి.. ఇక్కడ చేర్చుకున్నారు. ప్రత్యేక నిపుణులైన వైద్యులు మారుతీ శర్మ, శిల్పారెడ్డి, పృథ్వీ, సునీల్, ప్రభు, వర్షిత్ పర్యవేక్షణలో 14 మంది నర్సులు, 20 మంది ఆయాలు, మొత్తం 60 మందితో కొవిడ్ రోగులకు వైద్య సేవలు అందించారు.