వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తల సేవలు
గర్భిణులు, పిల్లల సంరక్షణకుప్రత్యేక చర్యలు
పెద్దపల్లి రూరల్, మే 21: కరోనా కట్టడే లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది ముందుకు వెళ్తున్నారు. ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే చేస్తూ, లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందుకుండా ప్రణాళిక ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, సిబ్బంది విశేష సేవలు అందిస్తున్నారు. ఇటీవల ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే చేసి లక్షణాలు ఉన్న వారిని గుర్తించా రు. వారికి పరీక్షలు చేయిస్తూ, ప్రభుత్వ మెడికల్ కిట్ను అందజేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ టీకా డోసులు వేశారు. ప్రభు త్వ మార్గదర్శకాల ప్రకారం ఇంటింటా జ్వర సర్వేను చేయాలన్న ఆదేశాలతో ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ దాకా మూడు రోజుల పాటు సర్వే నిర్వహించారు. ఇటీవల కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ప్రత్యేక చొరవతో గ్రామాల్లో మళ్లీ సర్వేకు ఆదేశించారు. మూడు రోజులుగా మళ్లీ గ్రామాల బాట పట్టిన ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబాన్ని పలుకరిస్తూ సర్వే చేస్తున్నారు. సర్వే కమిటీలో ఏఎన్ఎం, ఆశ వర్కర్, సీఏ, పంచాయతీ కార్యదర్శి వివరాలను నమోదు చేశారు. పెద్దపల్లి మండలంలోని 30 గ్రామపంచాయతీల్లో నిర్వహించిన సర్వే ప్రకా రం ఇప్పటి దాకా 757 మంది కరోనా పాజిటివ్ బారిన పడగా, 293 మంది కోలుకున్నారు. 442 మంది స్వల్ప లక్షణాలతో హోం ఐసొలేషన్లో కోలుకుంటున్నారు. ఇప్పటి వరకు 22 మంది కొవిడ్ బారిన పడి మరణించారు.
తల్లులు, పిల్లలపై శ్రద్ధ
కరోనా కష్టకాలంలోనూ గర్భిణులు, చిన్నారులపై ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గర్భిణులను దవాఖానకు వచ్చేలా ప్రోత్సహిస్తూ వారికి మందులు అందజేయిస్తున్నారు. పౌష్టికాహారం తీసుకోవడంపై అవగాహన కల్పిస్తున్నారు. వారికి కేసీఆర్ కిట్టు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. పుట్టిన పిల్లలు ఐదేండ్ల వయసు వచ్చే దాకా వారికి టీకాలు వేయించేలా ప్రోత్సహిస్తున్నారు. వారి ఆరోగ్య వివరాలు నమోదు చేసుకుంటున్నారు. వైరస్ విజృంభిస్తున్నా వేళ ప్రజల ప్రాణాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలకు అందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అందరి ఆరోగ్యమే..
వైద్యాధికారుల సూచనలు పాటిస్తున్నాం. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు విధులు నిర్వర్తిస్తున్నాం. కొంత మంది జ్వర సర్వేకు సహకరిస్తున్నారు. మరి కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అయినా వారికి నచ్చజెప్పి పనులు చేస్తున్నాం. అందరి ఆరోగ్యమే లక్ష్యం.
పౌష్టికాహారంపై అవగాహన
గ్రామాల్లో గర్భిణిలను గుర్తించి ప్రభుత్వం సేవలను అందిస్తున్నం. చిన్న పిల్లల ఆరోగ్యం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నం. కేసీఆర్ కిట్టుకు అర్హులను గుర్తించి ప్రభుత్వ దవాఖానలో సాధారణ ప్రసవాలపై వివరిస్తూ గర్భిణుల పేర్లు నమోదు చేస్తున్నం.