మెదక్, ఏప్రిల్ 20 : మహిళలు తమ భద్రత విషయంలో షీ టీమ్కు ఫిర్యాదు చేయడంలో ఈ క్యూ ఆర్ కోడ్ వాల్ పోస్టర్ తో మరింత సులభతరం చేశామని ఎస్పీ చందనదీప్తి తెలిపారు. జిల్లా పరిధిలో వేధింపులకు గురవుతున్న బాధిత మహిళలు తమ భద్రత కోసం ఇకపై క్యూ ఆర్ కోడ్ స్కాన్ ద్వారా సులభంగా ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ చందనదీప్తి మహిళలకు పిలుపునిచ్చారు. షీ టీమ్ విభాగం కోసం రూపొందించిన క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా పరిధిలోని ప్రధాన కూడళ్లలతో పాటు ప్రధానంగా బస్టాండ్, రైల్వే స్టేషన్, సినిమా థియేటర్స్, విద్యా సంస్థలు ఉన్న ప్రాంతాల్లో ఈ పోస్టర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బాధిత మహిళలు షీ టీమ్ బృందాలకు ఫిర్యాదు చేయదలచుకున్నప్పుడు తమ స్మార్ట్ ఫోన్లో షీ టీమ్ ఏర్పాటు చేసిన క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడంతో వెబ్సైట్కు అనుసంధానం అవుతుందన్నారు. ఈ సైట్లో గల ఫారంలో బాధితులు తమ పూర్తి వివరాలతో పాటు వారి ప్రస్తుత లొకేషన్ పూరించి ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుందన్నారు. కోడ్ స్కానింగ్ తో వచ్చిన ఫిర్యాదులపై జిల్లా షీ టీమ్ ఐటీ విభాగంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని వచ్చిన ఫిర్యాదులను తక్షణమే సంబంధిత షీ టీమ్ విభాగాలకు అందజేసి మహిళకు తక్షణమే సాయం అందజేస్తాయని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడుతాయని ఎస్పీ చందనదీప్తి తెలిపారు.కార్యక్రమంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐ ప్రభాకర్రెడ్డి, జిల్లా షీ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.