సంగారెడ్డి, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూముల అమ్మకంపై కాంగ్రెస్, బీజేపీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నాయని, ఉద్దేశపూర్వకంగానే రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం ఆగిపోవాలని, అభివృద్ధి కుంటుపడాలని కాంగ్రెస్, బీజేపీ కుటిలనీతితో రాజకీయ కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పదేండ్ల కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఆంధప్రదేశ్లో 88,500 ఎకరాల ప్రభుత్వ భూములను అమ్మిండ్రు. నాడు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడూ పెదవి విప్పలేదు. తెలంగాణ, హైదరాబాద్లోని విలువైన ప్రభుత్వ భూములు అమ్మి ఆంధ్రా, రాయలసీమలో డబ్బులు ఖర్చుచేసిండ్రు. దీనిపై ఆనాడు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఎందుకు ప్రశ్నించలేదు?’ అని హరీశ్రావు నిలదీశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను హరీశ్రావు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ‘కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గింది. నిరుపయోగ ఆస్తులు అమ్మి పేదల సంక్షేమానికి, అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్లో చెప్పినం. ఆ మేరకు పారదర్శకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములు అమ్ముతున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బిడ్లు ఆహ్వానిస్తున్నం.
ఇందులో ఎవరైనా పాలుపంచుకోవచ్చు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ నిరర్థక ఆస్తులను అమ్మటం ద్వారా వచ్చే నిధులను తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నది. ఇకనైనా కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వ భూముల అమ్మకంపై గోబెల్స్ ప్రచారం మానుకోవాలి’ అన్నా రు. ‘బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పడు నిరుపయోగ ఆస్తులను విచ్చలవిడిగా అమ్మారు. ఇప్పుడు మాత్రం వాటిని అమ్మవద్దని మాట్లాడడం విస్మయం కలిగిస్తున్నది. చరిత్రలో ప్రభుత్వ భూమలు ఏ రాష్ట్రంలోనూ అమ్మనట్లు, తెలంగాణలోనే భూములు మొదటిసారిగా అమ్ముతున్నట్లు కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉన్నది’ అని చెప్పారు. ప్రతిపక్ష నేత భట్టివిక్రమార్క ప్రభుత్వ భూములు అమ్మవద్దని, తాము అధికారంలోకి వస్తే తిరిగి తీసుకుంటామని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు.
కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావటం కల్ల అని తేల్చి చెప్పిన మంత్రి.. సీనియర్ నాయకుడైన భట్టివిక్రమార్క ప్రభుత్వ భూముల అమ్మకంపై అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ‘2004 నుంచి 2014 వరకు వైఎస్ రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి సీఎంలుగా ఉన్న కాలంలో ఆంధప్రదేశ్లో 88,500 ఎకరాల ప్రభుత్వ భూములు అమ్మిండ్రు. తెలంగాణ, హైదరాబాద్లోని విలువైన భూములు అమ్ముతున్నా, ఇక్కడి డబ్బులు తీసుకెళ్లి ఆంధ్రలో ఖర్చు చేసినా నాడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న భట్టివిక్రమార్క ఏనాడూ ప్రశ్నించలేదు. ఆ రోజు మీ సోయి ఎక్కడకు పోయింది?’ అని విమర్శించారు. నాటి ప్రభుత్వ చర్యలను కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ తీవ్రంగా ఆక్షేపించిందని, తెలంగాణ భూముల అమ్మకంపై తాను ఆనాడే అసెంబ్లీలో ప్రశ్నించానని గుర్తుచేశారు.
మీకు ఆ నైతికత ఉన్నదా?
ప్రభుత్వ భూముల అమ్మకంపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, నిరర్థక ఆస్తుల అమ్మకం దేశంలో ఎప్పటినుంచో కొనసాగుతున్నదని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉనప్పుడు నిరర్థక ఆస్తులు అమ్మడం ఒప్పు అయితే నేడు తాము అమ్మడం ఎలా తప్పు అవుతుందని మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. ‘కరోనా కారణంగా ప్రభుత్వం వేలకోట్ల ఆదాయం కోల్పోయింది. నిరర్థక ఆస్తులమ్మి నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నది. భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు నిధుల కొరతతో తెలంగాణలో అభివృద్ది కుంటుపడాలని, రైతుబంధు, పింఛన్లు, ఉచిత కరెంటు సరఫరా, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, కల్యాణలక్ష్మి వంటి కార్యక్రమాలను నిలిపివేయాలని కోరుకుంటుండ్రు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే ప్రజలు తమ పార్టీకి అవకాశం ఇస్తారన్న కుటిలమైన ఆలోచన, రాజకీయ కుట్రను కాంగ్రెస్ నాయకులు అమలు చేస్తుండ్రు’ అని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేతలకు ఎంతసేపు రాజకీయాలు, అధికారంపై యావ తప్ప ప్రజల గురించి ఆలోచన ఉండదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములు అమ్మిందీ తన వద్ద లెక్కలు ఉన్నయని, అవసరమైతే భట్టి విక్రమార్కకు పంపిస్తానని చెప్పారు. ‘సీఎం కేసీఆర్ నిరుపయోగ ఆస్తులమ్మి, ఆ నిధులతో తెలంగాణలో అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలని కోరుకుంటున్నారని, రైతులు ఆత్మగౌరవంతో బతకాలని, దేశానికి ఆదర్శంగా నిలవాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ప్రభుత్వ భూమలు అమ్ముతున్నదని స్పష్టంచేశారు. ‘ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లో జరుగుతున్నది. బిడ్డింగ్లో కాంగ్రెస్ నాయకులు సహా ఎవరైనా పాల్గొనవచ్చు. ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా వచ్చే ప్రతిపైసాను రాష్ట్ర ప్రజల అభివృద్ధ్ది, సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది’ అని హరీశ్ చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎంపీలు ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మహిపాల్రెడ్డి, మాణిక్రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నేతల మాటలు విడ్డూరం
భూముల అమ్మకంపై బీజేపీ నాయకుల మాటలు సైతం విడ్డూరంగా ఉన్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. ‘రాష్ర్టాల్లోని నిరుపయోగ ఆస్తులు జల్ది జల్ది అమ్మాలని, ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులు వేగంగా ఉపసంహరించాలని కేంద్ర ఆర్థిక శాఖ రాష్ర్టాలకు ఇటీవలే లేఖ రాసింది. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మాలని చెప్పింది. ఆ లేఖను త్వరలోనే బహిర్గతం చేస్తా’ అని మంత్రి హరీశ్రావు చెప్పారు. ‘నిరుపయోగ ఆస్తులను వేగంగా అమ్మే రాష్ర్టాలకు ప్రోత్సాహకాలు, ప్రైజ్లు అందజేయనున్నట్లు లేఖలో ఉన్నది. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరిస్తే, నిరర్థక ఆస్తులు అమ్మితే 40% డబ్బులను దీర్ఘకాలికంగా ఇస్తామని కేంద్రం చెప్పింది. మొత్తం రూ.6,000 కోట్ల నిధుల్లో వేగంగా పెట్టుబడులు ఉపసంహరించే వారికి ప్రైజ్గా రూ.1000 కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పింది. అసలు కేంద్రంలో పెట్టుబడుల ఉపసంహరణ శాఖను తెచ్చిందే బీజేపీ’ అని హరీశ్రావు చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వం జల్ది అమ్ముండి అంటుంది. ఇక్కడి బీజేపీ ఆయకులు భూములు అమ్మవద్దు అంటున్నరు.
మీ ప్రభుత్వానికి మీరే ఉల్టాగా మాట్లాడుతున్నారు. తెలిసి మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా?’ అని ప్రశ్నించారు. ‘కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంలోని ఓడీఎఫ్, బీడీఎల్, బీహెచ్ఈఎల్ సంస్థల భూములను అమ్మే ప్రయత్నం చేస్తున్నది. రైల్వేను ప్రైవేటుపరం చేస్తున్నది. కేంద్ర సర్కారు 24 ప్రభుత్వ రంగ సంస్థల నుంచి 45 సార్లు వాటాలను అమ్మింది. అలాంటి బీజేపీ నేతలు ఇప్పుడు ప్రభుత్వభూముల అమ్మకంపై మాట్లాడం విడ్డూరంగా ఉన్నది. పన్నులను ఎడాపెడా పెంచుతున్నరు. పెట్రో, డీజిల్పై ఈ ఏడాది ఎక్సైజ్ డ్యూటీ విపరీతంగా పెంచిండ్రు. 2014లో పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ.9 ఉంటే ఇప్పుడు రూ.35కు పెరిగింది. 2014లో డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ.3 ఉంటే ప్రస్తుతం 31కి పెంచారు’ అని హరీశ్రావు చెప్పారు. బీజేపీ ప్రభుత్వం మాదిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపలేదని గుర్తుచేశారు. కరోనాతో ఆర్టీసీ ఆర్థికంగా నష్టపోతున్నా సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేసి ఆర్టీసీని కాపాడుతున్నారని, కరోనా కష్టకాలంలో సైతం రైతుబంధు, ఆసరా పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని చెప్పారు.