హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎంసెట్ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు గణితం ప్రశ్నలు విద్యార్థులను కాస్త ఇబ్బందిపెట్టాయి. కొన్ని ప్రశ్నలు అత్యంత కఠినంగా, మరికొన్ని ప్రశ్నలు అతిపెద్దగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. నాలుగైదు ప్రశ్నలు అతిపెద్దగా ఉండటంతో అధిక సమయాన్ని తీసుకున్నాయి. ఫలితంగా విలువైన సమయాన్ని కోల్పోయినట్టు పేర్కొన్నారు. రెండు సెషన్లల్లోనూ ఇచ్చిన ప్రశ్నలను మూడుగంటల్లో పూర్తిచేసే వీలులేకపోయిందని, రఫ్ చేసుకోవడానికి పేపర్లు తక్కువగా వచ్చాయని విద్యార్థులు పేర్కొన్నారు.
ఎంసెట్పై కనిపించని కరోనా ప్రభావం
ఈ ఏడాది ఎంసెట్పై కరోనా ప్రభావం కనిపించలేదు. గతేడాది కరోనా తీవ్రత కారణంగా 71 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఎంసెట్కు హాజరయ్యారు. బుధవారం తొలి రెండు సెషన్లకు 91 శాతానికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. మరో నాలుగు రోజులపాటు పరీక్షలు ఉండటంతో హాజరయ్యే వారి సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పరీక్షల నిర్వహణను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్, కన్వీనర్ గోవర్ధన్, కో కన్వీనర్ చంద్రమోహన్ పర్యవేక్షించారు.
తొలిరోజు 91 శాతం హాజరు
ఎంసెట్ తొలిరోజు రెండుసెషన్లు కలుపుకుంటే 54,983 మంది విద్యార్థులకు 50,134 మంది (91.18శాతం) విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం పరీక్షకు తెలంగాణలో 21,801 మందికి 20,363 మంది (93.40 శాతం), ఏపీలో 5,655 మందికి 4,718 మంది (83.43 శాతం) పరీక్షలకు హాజరయ్యారు. ఏపీ-తెలంగాణ కలుపుకుంటే 27,456 మందికిగాను 25,080 (91.35 శాతం) విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్కు తెలంగాణలో 21,978 మందికి 20,446 (93.03 శాతం) మంది, ఏపీలో 5,549 మందికిగాను 4,608 (83.04శాతం) విద్యార్థులు హాజరయ్యారు. ఏపీ-తెలంగాణ కలుపుకుంటే 27,527 మందికి 25,054 (91.02శాతం) మంది పరీక్ష రాశారు.