హైదరాబాద్ : దళిత సాధికారత కోసం సీఎం స్వయంగా ముందుకు రావడం సంతోషంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకం విధివిధానాల రూపకల్పనపై ప్రగతి భవన్లో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. సమావేశానికి హాజరైన చాడ వెంకట్రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ 2003లోనే దళిత సాధికారత కోసం సమావేశం ఏర్పాటు చేసి అనేక అంశాలు చర్చించినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి వంటి పథకాలు దళితులకు భరోసా ఇస్తున్నాయన్నారు. దళితుల్లో మరింత స్థైర్యాన్ని నింపే విధంగా వారిపై దాడులు జరిగితే ఊరుకోం అనే రీతిలో ప్రభుత్వం కార్యచరణ చేపట్టాలని పేర్కొన్నారు.