హుజూరాబాద్: నూలు, చేనేత వస్త్రాలపై జీఎస్టీ వేస్తున్న కేంద్ర ప్రభుత్వం నేత కార్మికుల నడ్డి విరుస్తున్నదని టీఆర్ఎస్ నేత ఎల్ రమణ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నదని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పథకాలన్నింటినీ ఎత్తివేస్తున్నదని విమర్శించారు. హుజూరాబాద్లో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో కలిసి ఎల్ రమణ మీడియాతో మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబానీ, అదానీలకు వేల కోట్లు దోచిపెడుతున్నదని రమణ ఆరోపించారు. ముడి సరికులపై సబ్సిడీ, థ్రిఫ్ట్ఫండ్, నేతన్నకు బీమాతో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని చెప్పారు. తమ బతుకులు దుర్భరం చేసిన ఈటలకు నేతన్నలు ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు.
ఈటల రాజేందర్ తన స్వప్రయోజనాల కోసం రాజీనామా చేశారని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. ఈటల ఉద్దేశాన్ని ప్రజలు గమనించారని, ఈ నెల 30న తగిన తీర్పునిస్తారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ నల్ల చట్టాలు తెచ్చిందన్న ఈటల ఆ పార్టీలో ఎలా చేరారని ప్రశ్నించారు. పద్మశాలీల ఆత్మగౌరవ భవనానికి సీఎం కేసీఆర్ హైదరాబాద్లో రెండున్నర ఎకరాల స్థలం కేటాయించారని చెప్పారు.
గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై కేంద్రం ఎనలేని భారం మోపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలు తగ్గిస్తామని బీజేపీ ప్రభుత్వం, ఈటల హామీ ఇస్తారా అని ప్రశ్నించారు. బీసీ బిడ్డని అని చెప్పుకునే ఈటల రాజేందర్ బీసీలకు చేసిందేమీ లేదన్నారు. హుజూరాబాద్లోని పద్మశాలీలు గెల్లు శ్రీనివాస్కు ఓటు వేసి గెలిపిస్తారని చెప్పారు.