సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
రాజన్న సిరిసిల్ల, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఉపాధికి ఊతమిచ్చి.. బతుకునిచ్చి.. జీవితాలకు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు నేతన్నలు జై కొట్టారు. నేత కార్మికులకు బీమా సౌకర్యం.. పద్మశాలీ ట్రస్టుకు ఐదెకరాల స్థలంతోపాటు భవన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ఈ నెల 4న సిరిసిల్ల వేదికగా సీఎం ప్రకటించడంపై కృతజ్ఞతగా పద్మశాలీ సంఘం, మాక్స్ సంఘాల ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో బుధవారం భారీ ర్యాలీ తీశారు. 30 వేల మరమగ్గాలు, 300 వార్పిన్లు, 200 డైయింగ్లు, సైజింగ్లు అన్ని బంద్పెట్టి వందల సంఖ్యలో కార్మికులు తరలివచ్చారు. కొత్తబస్టాండ్ వద్ద ర్యాలీని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ జెండా ఊపి ప్రారంభించారు. గోపాల్నగర్, అంబేద్కర్ చౌరస్తాల మీదుగా నేతన్న చౌరస్తా దాకా ర్యాలీ సాగింది. అక్కడ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు కార్మికులు పాలాభిషేకంచేసి కృతజ్ఞతను చాటుకున్నారు. అనంతరం నేతన్న విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో వస్త్ర వ్యాపార సంఘం నాయకులు గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణీ, మంచె శ్రీనివాస్, చిమ్మని ప్రకాశ్, బొల్లి రాంమోహన్, మాక్స్, ఎస్ఎస్ఐ, పాలిస్టర్ అసోసియేషన్, సైజింగ్, డైయింగ్, వార్పిన్, వైపని కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.